ఖమ్మం, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సాధారణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.352కు పెంచింది. పెరిగిన ధరలు సామాన్యుడి నుంచి రోడ్డు పక్కన టీ, టిఫిన్లు విక్రయించే వారిపై ప్రభావం చూపనున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే కేంద్రం మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో సిలిండర్ ధర రూ.460 ఉండగా ఆ ధర ఇప్పుడు రూ.1,160కు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ తొమ్మిదేళ్లవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. పైగా నిత్యావసర ధరలను అమాంతం పెంచింది. సిలిండర్ ధరల పెంపుపై ఉమ్మడి జిల్లాకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ గ్యాస్ సిలిండర్పై రూ 50 పెంపు..
జిల్లావ్యాప్తంగా 32 గ్యాస్ ఎజెన్సీలు ఉండగా వీటి పరిధిలో 4,10,404 కనెక్షన్లు ఉన్నాయి. చమురు సంస్థలు బుధవారం గ్యాస్ ఒక్కో సిలిండర్ ధరనకు రూ.50 పెంచాయి. ఫిబ్రవరి 28న రూ.1,084 ఉన్న ధర మార్చి 1కి రూ.1,134కు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.2.5 కోట్ల భారం పడనున్నది.
వాణిజ్య సిలిండర్ ధరలు పైపైకి….
వంట గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే కాకుండా వాణిజ్య సిలిండర్ ధర కూడా కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచింది..గత నెలలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,925 ఉండగా మార్చి 1కి ఆ ధర రూ.352 పెరిగి రూ.2,277కు చేరింది. సిలిండర్ ధరల పెంపుతో జిల్ల్యావ్యాప్తంగా వినియోగదారులపై రూ.2.81 లక్షల భారం పడనున్నది.. చిన్న హోటళ్లు, బజ్జీల కోట్లు, చాయ్వాలాలు, తోపుడు బండ్లపై తినుబండారాలు విక్రయించే వారికి పెరిగిన ధరలు మరింత భారం కానున్నాయి.మాకు కట్టెల పొయ్యే దిక్కు..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచింది. ఇక మాకు కట్టెల పొయ్యే దిక్కైంది. సిలిండర్ కొనలేక అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి వంట చేసుకుంటున్నాం. సామాన్యులు సిలిండర్ ధర కొనే పరిస్థితి లేదు. అందరికీ ఇక కట్టెలపొయ్యే దిక్కు. కూలి నాలీ చేసుకునే జీవించే మాకు ధరల భారాన్ని మోసే శక్తి ఉంటుందా. కేంద్రానికి పేదలపై జాలి లేదు.
– దుంపా సత్యావతి, గృహిణి, సత్యంపేట, సత్తుపల్లి మండలం
నిరుపేదలు నలిగిపోతున్నారు.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో నిరుపేదలు నలిగిపోతున్నారు. పైగా కేంద్రం మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బీజేపీ సర్కార్కు బుద్ధి చెప్తారు. ప్రజల ఆగ్రహానికి గద్దె దిగడం ఖాయం. మహిళలంతా ఒక్కటిగా పోరాడితే తప్ప కేంద్రానికి బుద్ధి వచ్చేటట్లు లేదు.
– దమ్మాలపాటి శ్రీదేవి, గృహిణి, తిమ్మినేనిపాలెం, చింతకాని మండలం
బీజేపీని ఓడిస్తేనే ధరలకు కళ్లెం
అదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారులకు బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దోచిపెడుతున్నది. కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయి. గడిచిన ఎనిమిదేళ్లలో సిలిండర్ ధర రెండు రెట్లు పెరిగింది. కేంద్రం ఓ వైపు రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతూనే మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ వంటి నిత్యావసరాలు పెంచుతున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను దుర్భరం చేస్తున్నది.
– ఇరుగు సునీత, మంగలితండా, గృహిణి, కూసుమంచి మండలం
మేం బతికేది ఎట్లా..?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తరచూ పెంచుతున్నది. నిరుపేదలపై భారం మోపుతున్నది. సామాన్యులు సిలిండర్ కొనే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. మేం ధరల భారం మోయలేక కట్టెల పొయ్యి వాడుతున్నాం. మాలాంటి ఇంకా ఎందరో పేదలది ఇదే పరిస్థితి. కేంద్రానికి పేదలపై జాలి లేదు. ఇలా అయితే పేదలు బతికేది ఎట్లా?
– ఎండీ నసీమా, గృహిణి, పాల్వంచ
గ్యాస్బండ గుదిబండ
సామాన్య ప్రజలకు గ్యాస్ బండ గుదిబండగా మారింది. పెంచిన సిలిండర్ ధరలను బీజేపీ ప్రభుత్వం తక్షణం తగ్గించాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు సిలిండర్ ధరలు పెంచింది. ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి మీదే వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తూనే మరోవైపు ధరలు పెంచడం అన్యాయం. కేంద్రం తీరును వైరా నియోజకవర్గ ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా.
– రాములునాయక్, వైరా ఎమ్మెల్యే
పేదలకు ఇబ్బంది..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేద మధ్య తరగతి కుటుంబాలపై పెను భారాన్ని మోపుతున్నది. ఇప్పటికే జీఎస్టీ పేరుతో ప్రజలను దోచుకుంటున్నది. తాజాగా సిలిండర్ ధరలు పెంచి కంపెనీల కొమ్ము కాస్తున్నది. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే పేదలకు ఉచితంగా సిలిండర్లు ఇవ్వడం దేనికి? గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికీ అవసరమైన వస్తువు. వీలైతే ధరలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణం.
– కందాళ ఉపేందర్రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
ధరల భారం..
కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరల భారం మోపు తున్నది. మరోసారి సాధారణ సిలిం డర్పై రూ.50, వాణిజ్య సిలిండర్పై రూ.350 పెంచింది. సిలిండర్ ధరలను అడ్డగోలుగా పెం చుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలు తిరిగి కట్టెల పొయ్యి వాడే స్థితికి తీసుకొచ్చింది. ఒకవైపు ఉజ్వల స్కీంలో సిలిండర్లు అందిస్తూ మరోవైపు ధరలు పెంచడం దారుణం.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
మరోసారి సామాన్యులపై భారం..
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి జనంపై భారం మోపుతున్నది. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వారికి సిలిండర్ ధరల పెంపు ఎంతో భారం. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో సిలిండర్ ధర రూ.460 ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ.1,160 కు చేరింది. మార్చి 8న మహిళల దినోత్సవం జరుగున్నది. దేశంలోని మహిళలందరికీ ప్రధాని మోదీ ఇచ్చే ఉమెన్స్ డే గిఫ్ట్ ఇదే. ప్రధాని అర్థం లేని నిర్ణయాలతో సామాన్యుడు కుదేలవుతున్నాడు.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
రేపు నిరసన కార్యక్రమాలు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుపేదలను కష్టాల పాలు చేస్తున్నది. పెరిగిన సిలిండర్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలకు నిరసనగా పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను దుర్మార్గంగా పెంచుతున్నది. నిరసన కార్యక్రమాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఒకవైపు ఉజ్వల సీం పేరుతో ఉచితంగా సిలిండర్ను ఉచితంగా ఇచ్చి ఆ వెంటనే ధరలను పెంచడం ఎంతవరకు సమంజసం. నిరసన కార్యక్రమాలకు ప్రజలు భారీగా హాజరుకావాలి.
– తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు