అశ్వారావుపేట, మే 22:వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వరి నారు తయారీపై రైతులు దృష్టి సారించారు. అయితే బలమైన నారుతోనే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. కనీస మెళకువలు పాటించడం ద్వారా నాణ్యమైన వరి నారును తయారు చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా పైరుకు రోగ నిరోధక శక్తి లభిస్తుందని సూచిస్తున్నారు. వరి సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది సాగు ప్రణాళిక 6.16 లక్షల ఎకరాలు. ఇందులో వరి ప్రధాన పంటగా 2.15 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. రానున్న వానకాలంలో వరి సాగుకు ముందస్తు నారు తయారు చేసుకునేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ధాన్యం దిగుబడులు ఎక్కువగా సాధించేందుకు బలమైన నారు తయారు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఇందుకోసం యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వరి నారు తయారు చేసుకోవాలని చెబుతున్నారు. దీని ద్వారా వరి సాగులో చీడపీడల బెడదను నివారించవచ్చని చెబుతున్నారు. నాణ్యమైన నారు తయారీకి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పలు యాజమాన్య పద్ధతులు సూచిస్తున్నారు.
విత్తన శుద్ధి..
మెట్ట నారుమడులు ఉంటే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ను తడితో పట్టించాలి. ఆరబెట్టి నారు మడుల్లో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమడులైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ను కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి తర్వాత మండె కట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలకు లీటరు నీరు సరిపోతుంది. నిద్రావస్థను తొలిగించడానికి లీటరు నీటికి నత్రికామ్లాన్ని కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టాలి. అనంతరం కడిగి మండె కట్టాలి. తక్కువ నిద్రావస్థ (2-3 వారాలు) ఉన్న విత్తనాలైతే 6.3 మిల్లీ లీటర్లు, ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలు) ఉన్న విత్తనాలైతే 10 మిల్లీ లీటర్ల నైట్రిక్ యాసిడ్ను వినియోగించాలి.
నారుమడి పెంపకం..
అధికారుల సూచనలు పాటించాలి..
రైతులు నాణ్యమైన నారు తయారు చేసుకునేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. బలమైన నారు తయారు చేయడం ద్వారా పంటలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు పొందొచ్చు. లేకుంటే పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పంట దిగుబడిలో నాణ్యత దెబ్బతింటుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారు. వారి సూచనల మేరకు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
–వై.నవీన్, మండల వ్యవసాయ అధికారి, అశ్వారావుపేట