భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కొత్త ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన మరో రెండు గ్యారెంటీ హామీలు అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉన్నాయి. 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ను వినియోగించుకున్న పేదలకు జీరో బిల్ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. రేషన్కార్డులు ఉన్న వారే ఈ రెండింటికీ అర్హులని మెలికపెట్టింది. దీంతో రేషన్కార్డులు లేనివారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ పథకాలు మొదలుకావడంతో వారంతా లబోదిబోమంటున్నారు.
ప్రజాపాలన పేరుతో ఊరూరా ఆర్భాటంగా గ్రామసభలు పెట్టిన ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరించింది. పథకాలన్నింటికీ రేషన్కార్డునే ప్రామాణికంగా పేర్కొంది. కానీ రేషన్కార్డులు లేని వారూ కూడా సభలకు పోటెత్తడంతో అసలు ఫార్మాట్లో కాకుండా తెల్లకాగితాలపై రేషన్కార్డుల దరఖాస్తులు స్వీకరించింది. కానీ వాటిని జారీ చేయలేదు. కానీ ఎక్కువమంది పేదలు లబ్ధిపొందే 200 యూనిట్ల కరెంటు, రూ.500 గ్యాస్ వంటి పథకాలను ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించింది. అయితే రేషన్కార్డులు లేనివారంతా ఇప్పుడు ఈ పథకాలకు అర్హతను కోల్పోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు ఉచిత సలహాలు విసిరేశారు. పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు అందించని వారంతా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో మళ్లీ దరఖాస్తులు అందజేయాలని సలహాలు ఇచ్చారు. కానీ కొత్త రేషన్ కార్డుల జారీపై మాత్రం స్పష్టమైన ప్రకటనలేమీ చేయలేదు. కానీ పథకాలను అసలు మూలమైన రేషన్ కార్డులు లేకుండా దరఖాస్తులు ఎలా చేసుకోవాలని, పథకాలకు ఎలా అర్హత సాధించాలని కార్డులేని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులు లేని తమ పరిస్థితి ఏమిటోనంటూ దిగులుపడుతున్నారు. రేషనస్కార్డుల్లేని తమకు ఆ హామీలను అమలుచేయకుండా మంగళం పాడినట్లేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ప్రకటించిన మరో రెండు హామీల్లో భాగంగా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ను అధికారులు మొదలుపెట్టారు. శనివారం నుంచి భద్రాద్రి జిల్లాలో విద్యుత్ సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి కరెంటు బిల్లుల రీడింగ్ను నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఉన్న అర్హులకు జీరో బిల్లును అందజేస్తారు. కానీ రేషన్ కార్డులు లేని పేదలు మాత్రం పూర్తి బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 2,82,439 గృహ వినియోగ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. 2,93,300 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం మరో 20 వేల మందికి వరకూ దరఖాస్తు చేసుకొని ఉన్నట్లు సమాచారం. కొత్తగా వివాహమైన వారు వేరు కాపురం పెట్టడం, చిన్న కుటుంబాలుగా ఏర్పడి అద్దెలకు ఉండడం వంటి కారణాలతో రేషన్కార్డుల దరఖాస్తులు ఎక్కువయ్యాయి.
కానీ వీరికి రేషన్ కార్డులు లేకపోవడంతో వీరంతా ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందలేకపోతున్నారు. అదే విధంగా జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 3.90 లక్షలు ఉన్నాయి. ఈ మేరకు రేషన్కార్డులు కూడా ఉండాలి. కానీ సుమారు లక్ష కార్డుల వరకూ తక్కువగా ఉన్నాయి. కేవలం రేషన్ కార్డుల్లేని కారణంగా ఈ పథకంలోనూ అధికమంది ప్రజలు లబ్ధిపొందలేకపోతున్నారు. అయితే రూ.500కే గ్యాస్ పథకంలోనూ ప్రభుత్వం అనేక మెలికలు పెట్టింది. మూడేళ్ల సగటు వినియోగాన్ని బట్టే రూ.500 సబ్సిడీ అందిస్తామని చెబుతోంది. అదీగా ఈ పథకాన్ని వియోగించుకోవాలంటే తొలుత లబ్ధిదారులు సదరు గ్యాస్ ఏజెన్సీకి మొత్తం నగదును చెల్లించాలి. ఆ తరువాత రూ.500ను ప్రభుత్వం లబ్ధిదారులకు రిఫండ్ చేయనుంది.
కూలి పనులు చేసుకునే జీవించే మాకు రేషన్ కార్డు లేదు. దీని కోసం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకునేందుకు వెళ్లాం. అయితే ప్రజాపాలన సభలు ఆరు గ్యారెంటీ పథకాల కోసమని, రేషన్ కార్డుల జారీకి కాదని అక్కడి అధికారులు చెప్పారు. మీసేవా కేంద్రానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తీరా అక్కడికి వెళ్తే రేషన్కార్డు కోసం ఆన్లైన్లో ఐప్లె చేసే అవకాశం లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలను మొదలు పెడుతోంది. ఇప్పుడు మొదలుపెట్టిన కరెంటు, గ్యాస్ పథకాలను రేషన్ కార్డు కచ్చితంగా కవాలంటున్నారు. కానీ మా దగ్గర అది లేదు. దీంతో ఆ పథకాలు మాకు వర్తించవని చెబుతున్నారు. ఏం చేయాలో తోచట్లేదు.
-ధరావత్ శ్రీదివ్య, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించుకుంటున్న పేదలకు జీరో బిల్లులను జారీ చేస్తున్నాం. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి మీటర్లలో యూనిట్లను నమోదు చేస్తున్నారు. నిర్ణీత యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించిన లబ్ధిదారులకు అక్కడికక్కడే జీరో బిల్లును తీసి ఇస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే అసలైన అర్హులు ఎంతమంది ఉన్నారో తేలిపోతుంది. మాకు వచ్చిన ప్రజాపాలన జాబితా ఆధారంగా దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తున్నాం.
రేషన్కార్డులు ఉండి 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించిన వారినే అర్హులుగా నిర్ధారిస్తున్నాం. నిర్ణీత యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ను వినియోగించిన వారు మొత్తం బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. అర్హులెవరైనా ఉండి సరైన ధ్రువపత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం.
-రమేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ, కొత్తగూడెం
ప్రజాపాలన దరఖాస్తు పట్టుకొని ఆ మధ్య కరెంటోళ్లు మా ఇంటికి వచ్చారు. వివరాలన్నీ రాసుకున్నాక రేషన్ కార్డు అడిగారు. మాకు రేషన్ కార్డు లేదని, దాని కోసం ప్రజాపాలన సభలో దరఖాస్తు పెట్టుకున్నామని చెప్పాము. అయితే రేషన్కార్డు లేనందున 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ మాకు రాదని అధికారులు తేల్చిచెప్పారు. ఇంకోవైపు రూ.500 గ్యాస్కు కూడా రేషన్ కార్డే కావాలంట. దీంతో అది కూడా మాకు వచ్చే అవకాశం లేదు. అసలు మాకు కొత్త రేషన్ కార్డు ఎప్పుడిస్తారో చెప్పలేదు. కానీ కార్డు లేని కారణంగా ఇప్పుడు అమలుచేస్తున్న ఈ పథకాలు మాకు అందకుండాపోతున్నాయి. పథకాలు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని మంత్రులు చెబుతున్నారు. కానీ కొత్త రేషన్కార్డులు ఎప్పుడిస్తారో అనే విషయం చెప్పడం లేదు.
-సంగ కార్తీక్, టేకులపల్లి మండలం