సారపాక, జూలై 14: పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ పీఎస్పీడీలో 8వ నూతన ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని అన్నారు. ఐటీసీలో విస్తరణ జరిగినప్పుడే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఐటీసీలో ఎనిమిదో ప్లాంట్ (మెషీన్) విస్తరణ కోసం సారపాకలోని బీపీఎల్ స్కూల్ ప్లే గ్రౌండ్లో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి భూక్యా రవీందర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. తాను ఒక రైతుగా కూడా మాట్లాడుతున్నానని, కర్మాగారం విస్తరణ వల్ల ఈ ప్రాంతానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. గోదావరి వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఐటీసీ యాజమాన్యం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు.
ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేయాలి..
ఫ్యాక్టరీని విస్తరించుకున్న ఐటీసీ.. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, వివిధ సంఘాలు, సంస్థ బాధ్యులు ముద్దా పిచ్చయ్య, బొల్లోజు అయోధ్య, తాళ్లూరి పంచాక్షరయ్య కోరారు.
భారీ బందోబస్తు..
ప్రజాభిప్రాయ సేకరణకు కొత్తగూడెం ఓఎస్డీ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి, హెచ్ఆర్ శ్యాంకిరణ్, అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, ఐటీసీ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల బాధ్యులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి: ఎంపీ మాలోతు కవిత
ఐటీసీ యాజమాన్యం ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు ఇక్కడి ప్రజల ప్రజారోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కోరారు. కార్మికులు, ఉద్యోగులతోపాటు స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రిని నెలకొల్పాలని అన్నారు.
రైతులకు మద్దతు ధర కల్పించాలి: తాతా మధు, ఎమ్మెల్సీ
ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు ఐటీసీని నమ్ముకొని వేలాది ఎకరాల్లో జామాయిల్, సుబాబుల్ సాగుచేస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. అయితే మద్దతు ధర విషయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వారి శ్రమను గుర్తించి మద్దతు ధర కల్పించి వారికి ఆదుకోవాలని కోరారు.