ఖమ్మం, జనవరి 23: ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ప్రధానం. ఇలా ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల పాలవడం ఖాయం. అందుకే మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. అనారోగ్యాన్ని కొనితెచ్చే జంక్ఫుడ్స్ తీసుకోకూడదు. నోటి రుచి కోసం మనం తీసుకునే కలర్ఫుల్ పదార్థాలన్నీ మన శరీరానికి హాని చేసేవే. డయాబెటిస్, బీపీ, స్థూలకాయం.. ఇలా సర్వ రోగాలకూ క్రమం తప్పి ఆహారం తీసుకుంటూ ఉండడం, ఫాస్ట్ఫుడ్ తినడమే. ఆరోగ్యకరమైన ఆహారం పట్ల అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉంటే తప్ప ఆ వ్యాధుల నుంచి తప్పించుకోలేము.
ఈరోజుల్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిన్నారులు, పెద్దలు పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్ వంటి వాటిపై ముక్కువ చూపుతున్నారు. చిన్న వయస్సులోనే రోగాల పాలవుతున్నారు. అధికంగా బరువు పెరుగుతున్నారు. మరికొందరు స్థూలకాయం, టైప్-2 మధుమేహం బారినపడుతున్నారు. శిశువు దశ నుంచి వృద్ధాప్యం వరకు శరీరానికి అవసరమయ్యే ఆహారం ఒకలా ఉండదు. వైద్యులు, డైటీషియన్ల సూచనలు పాటించాలి. దీనికి తోడు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శరీర జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.
హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన చిన్న బండ్లపై బజ్జీలు, పకోడి, పుణుగులు అమ్మేవారు ఎక్కువగా పామాయిల్ నూనె వాడతారు. నూనెను ఒకసారి మరిగించి ఆహార పదార్థాలు వండుకుంటనే అది శరీరానికి మేలు చేస్తుంది. అదే నూనెను రెండు, మూడుసార్లు వినియోగిస్తే అది విషయంతో సమానం. జంక్ఫుడ్స్లోని సోడియం తలనొప్పికి కారణమవుతుంది. పలు రకాల వికారాలు మొదలవుతాయి. కొందరిలో మైగ్రేన్ కూడా వస్తుంది. కొందరిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా శరీర బరువు అమాంతం పెరుగుతుంది. చిన్నవయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
యుక్త వయస్సు నుంచి వృద్ధులు ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. కొవ్వు పదార్థాలు, చక్కెర పదార్థాలను తగ్గించాలి. విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్, ప్రోటీన్లు ఉండు పదార్థాలను తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన పాటించాలి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగం, బ్యాంకింగ్ ఉద్యోగులు ఉరుకులు పరుగుల జీవితంలో ఫాస్ట్ఫుడ్ తీసుకునే ఆ పూటకు గడిపేస్తున్నారు. వారిలో మెటబాలిక్ రేటు తగ్గిపోతున్నది.
ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరుబయట దొరికే జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ను దూరం పెట్టాలి. ఇంట్లో వండిన వంటకాలనే తినాలి. నియంత్రణ లేకుండా జంక్ఫుడ్ తింటే గుండెజబ్బులు రావడం ఖాయం. మితిమీరి బరువు పెరగడం ఖాయం. ఫాస్ట్ఫుడ్ను పక్కన పెట్టి తాజా కూరగాయలతో చేసిన కూరలు, మితంగా అన్నం, తాజా పండ్లు తింటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతిఒక్కరూ ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. వీటన్నింటితో పాటు ప్రతిరోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం.
– డాక్టర్ శ్రీకాంత్, ఎండీ, ఖమ్మం
చిన్నారులకు ఇచ్చే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలి. తాజా కూరగాయలతో చేసిన వంటకాలు, పండ్లు అందించాలి. చిన్నతనంలో ఎక్కువసేపు ఆడి శక్తిని కోల్పోతారు కాబట్టి ఎక్కువగా ప్రోటీన్లు ఉండే ఆహారం ఇవ్వాలి. పిల్లలు బరువు తగ్గేందుకు డైటింగ్ చేయించడం సరికాదు. వైద్యుల సలహా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు పెరుగు, పప్పులు, చేపలు, పాలు వంటి కాల్షియం ఉండే ఆహారం ఇవ్వాలి.