Telangana | భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అరకొరగా ప్రభుత్వ పథకాలు అందేవి. ఏ పథకం లబ్ధిపొందాలన్నా దళారుల ప్రమేయం ఉండేది. లేదా అధికారుల చేయి తడపాల్సి వచ్చేది. రైతులు సాగునీరు లేక, పంటలకు విద్యుత్ అందక ఇబ్బందిపడేవారు. వృద్ధులకు కేవలం రూ.200 పింఛన్ వచ్చేది. నాటి ప్రభుత్వాలకు ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పేద, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల ఊసే పట్టేది కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీమబారక్, కేసీఆర్ కిట్, దళితబంధు, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు.
సంక్షేమ పథకాల అమలు ఇలా..
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రైతుబంధు ద్వారా 1.34 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1726.86 కోట్లు జమయ్యాయి. రైతుబీమా ద్వారా ప్రమాదవశాత్తు మృతిచెందిన 1,605 మంది కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ అయ్యాయి. ప్రసవం తర్వాత 44,450 మంది బాలింతలకు కేసీఆర్ కిట్స్ అందాయి. ఏటా 1.19 లక్షల మందికి రూ.26.30 కోట్ల ఆసరా పింఛను అందుతున్నది. 4,365 మంది గిరిజనులకు రూ.కోట్ల ట్రైకార్ రుణాలు, గిరి వికాసం పథకం ద్వారా 468 మందికి రూ.76.61 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, మోటర్లు అందాయి. 92 మంది ఎస్సీ, ఎస్టీలకు టీ ప్రైడ్ ద్వారా రూ.111.67 కోట్ల రాయితీలు అందాయి. గొల్ల, కురుమలకు రూ.70.04 కోట్ల విలువైన గొర్రెల యానిట్లు మంజూరయ్యాయి. ఉమ్మడి పాలనలో కేవలం అంగన్వాడీ టీచర్లకు నెలకు కేవలం రూ.4,200 చొప్పున గౌరవ వేతనం అందేది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.13,650 చేరుకున్నది.
పేదింటి ఆడపిల్లల వివాహాలకు కానుక..
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ మేనమామలా కానుకగా రూ.1,00,116 అందిస్తున్నారు. ఇప్పటివరకు 25,317 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 20,956 మందికి చెక్కులు అందాయి. 4,300 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మరో 61 దరఖాస్తులు ప్రాసెసింగ్లో ఉన్నాయి.
కిడ్నీ బాధితులకు భరోసా..
కిడ్నీ బాధితులు వైద్యుల సూచించిన రోజు డయాలసిస్ చేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లతో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.