భద్రాచలం, డిసెంబర్ 3: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా విజయం సాథించిన అనంతరం ఆదివారం ఆయన తన కుటుంబ సమేతంగా భద్రాచలం చేరుకొని రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు, నా గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తాను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. తనపై నమ్మకంతో తనకు టికెట్ ఇచ్చి ఆశీస్సులు అందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
ఎన్నడూ పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరూ రేయింబవళ్లూ నిద్రాహారాలు మాని తన విజయం కోసం అవిరళ కృషి చేశారని అన్నారు. ఏ ఆశతో ప్రజలు తనను గెలిపించారో తాను వారి ఆశలను నేరవేరుస్తానని అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని, ఇకపై ఆ అభివృద్ధిని కొనసాగిస్తానని అన్నారు. భద్రాచలంలో మిగిలి ఉన్న కరకట్ట నిర్మాణం, పోడు భూములకు పట్టాలు, త్రీఫేజ్ కరెంట్, సాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈసారి భద్రాచలం సీటు గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారని అన్నారు. వారిచ్చిన స్ఫూర్తితో అహర్నిశలు శ్రమించామని, సమష్టి కృషితో విజయం సాధించామని అన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాత మధుసూదన్ మాట్లాడుతూ.. సౌమ్యుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావును నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని అన్నారు. వారి నమ్మకాన్ని నిలుపుకుంటూ పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, నాయకులు గూడపాటి శ్రీనివాస్, ఎండీ నవాబ్, తాళ్లపల్లి రమేశ్గౌడ్, మామిడి పుల్లారావు, నక్కా ప్రసాద్, మల్లెల లోకేశ్, దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, మహిళా నాయకులు గంగా భారతి, ఒగ్గు అనురాధ, కేతినేని లలిత, మానె కమల పాల్గొన్నారు.