ఖమ్మం, జనవరి 30 : పార్లమెంట్ చివరి సమావేశాల్లో పెండింగ్ సమస్యలపై తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోక్ సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. కేంద్రం వద్ద ఎన్నో పెండింగ్ సమస్యలున్నాయని, వాటిపై ప్రతి లోక్సభ సమావేశాల్లోనూ ప్రస్తావించి, తెలంగాణ వాణిని ఎంతో బలంగా వినిపించామని చెప్పారు. బయ్యారం ఉకు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు తదితర అన్ని పెండింగ్ అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేశామని నామా పేర్కొన్నారు.