జూలూరుపాడు : కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar ) స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో విధులు నిర్వహించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పోలీసులు హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
భవిష్యత్తులో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, తప్పుడు చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సరైన విధులు నిర్వహించి తగిన రీతిలో పనిచేయాలని పోలీసులకు హితవు పలికారు.