కూసుమంచి(నేలకొండపల్లి), మార్చి 5 : ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన ముజ్జుగూడెం సమీపంలోని బౌద్ధ స్థూపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బౌద్ధుల పరిపాలన, వారి చారిత్రక ఘట్టానికి ఆనవాళ్లుగా మిగిలిన ఈ స్థూపం కాలక్రమంలో మరుగునపడిందన్నారు. బౌద్ధులకు నిలయంగా పాలన సాగిన కాలంలో నేలకొండపల్లికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఆ చరిత్రను భావితరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో 8 ఎకరాల స్థలంలో చుట్టూరా అభివృద్ధి చేసేందుకు తగిన కార్యచరణ రూపొందించాలన్నారు.
స్థూపం చుట్టూ, పరిసరాలను శుభ్రం చేయాలని, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో స్థూపానికి సంబంధించి వివరాలు తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న విడిది కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భక్తరామదాసు నడయాడిన స్థలం కూడా ఇక్కడే ఉండడంతో ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదన్నారు. ఇప్పటివరకు బౌద్ధ స్థూపం వద్ద చేపట్టిన పనులు, వాటి వివరాలను కలెక్టర్ గౌతమ్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ ఏడీ నర్సింగ్నాయక్, టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్డీవో నగేశ్, స్పెషల్ ఆఫీసర్ శ్రీరాం, ఎంపీపీ వజ్జా రమ్య, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, స్వర్ణకుమారి, వెన్నెపూసల సీతారాములు, శాఖమూరి రమేశ్, నెల్లూరి భద్రయ్య, నాగేశ్వరరావు, చెరువు స్వర్ణ, బొందయ్య, అంజి, మామిడి వెంకన్న పాల్గొన్నారు.