మామిళ్లగూడెం, మే 24: జిల్లాల్లో రైతులు పండించిన పంటను ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా వారు దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు అంశంపై హైదరాబాద్లోని అంబేద్కర్ సచివాలయం నుంచి పౌర సరఫరాల సంస్థ చైర్మన్, శాఖ కమిషనర్తో కలిసి జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోదాముల్లో భద్రపరచాలని, ఇందుకోసం ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించాలని ఆదేశించారు.
అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: వ్రుక్టర్
వీసీలో ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 1,05,730 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ సమస్య రాకుండా అలాట్ చేసిన రైస్ మిల్లులు తప్పని సరిగా ధాన్యం దిగుమతి చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లు ఆగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో నగదు త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్డీవో విద్యాచందన, డీసీఎస్వో రాజేందర్, డీసీవో విజయకుమారి, డీఏవో విజయనిర్మల, డీటీవో కిషన్రావు, జిల్లా మార్ఫెడ్ మేనేజర్ సునీత, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సోములు పాల్గొన్నారు.
మణుగూరు నుంచి పాల్గొన్న భద్రాద్రి కలెక్టర్
మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచే జిల్లా అధికారులతో వీసీలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, మధుసూదన్, విజయ్కుమార్ పాల్గొన్నారు.