ఖమ్మం, ఫిబ్రవరి 8: ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ అరెస్ట్ను ఖండిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని రాష్ట్రప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎమ్మెల్యే అని, ఆ సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు తాము హాజరయ్యామని, నాడు భట్టివిక్రమార్క కార్యక్రమానికి విచ్చేసే వరకు వేచిచూసే వారమని గుర్తుచేశారు. మధిరలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవానికి నాడు తనతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తీర్థాల జరిగిన ఓ సమీక్షా సమావేశానికి తనను ఆహ్వానించలేదని, అలాగే ఇటీవల ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన ఓ సమీక్షా సమావేశానికి నగర మేయర్ నీరజను సైతం ఆహ్వానించలేదని మండిపడ్డారు. జిల్లా మంత్రులు ప్రభుత్వాధికారులు, పోలీస్శాఖలో ఉన్నతాధికారులకు కాల్ చేసి బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి పనులు చేయవద్దని హకుం జారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం జిల్లాలో మట్టి తవ్వకాలు, జీవో నంబర్ 59 పైనే రాజకీయాలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. తాను 59 జీవో ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాను ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరుతున్నానని, లేదా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్రమాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఎలాంటి శిక్ష విధించినా భరిస్తారని, అలా చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే జీవో 59 ద్వారా భూములు తీసుకున్నారని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. జిల్లాలో నాలుగు హైవే రహదారుల పనులు జరుగుతున్నాయని, వాటి నిర్మాణానికి అవసరమైన మట్టిని స్థానికంగానే సేకరించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. తన కృషితో ప్రస్తుతం రహదారి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.
కూసుమంచి మండలం జీళ్లచెరువులోని ఆలయ గుట్టపైకి వెళ్లేందుకు నాడు కేసీఆర్ ప్రభుత్వం రోడ్డు వేయాలని నిర్ణయించిందని, నిర్మాణానికి నాటి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్వచ్ఛందంగా రూ.కోటి సాయం అందించారని, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ కూడా ఇతోధికంగా సాయం చేశారని గుర్తుచేశారు. అలాంటి శేఖర్పై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆలయ పాలకమండలి సభ్యుల్లో ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారని, ఆయన్ను పోలీసులు కులం పేరుతో దూషించడం అనాగరిక చర్య అని అభిప్రాయపడ్డారు. దళితులంటే పోలీసులకు చిన్నచూపు ఉందన్నారు. ఇంటూరి శేఖర్తో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, ఆయన తన బినామీ అని కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణలను నిరూపిస్తే తాను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు.
ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుపై పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అది హేయమైన చర్య. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టడం అమానుషం. పోలీసులు కూడా బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు.
రాజకీయపరమైన కక్షసాధింపు చర్యలు సరైన విధానం కాదు. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అరెస్టును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సూర్యాపేట- ఖమ్మం హైవే నిర్మాణానికి భారీగా మట్టి అవసరమైంది. ఎమ్మెల్యేగా తాను ఎంతో శ్రమపడి వివిధ ప్రాంతాల నుంచి మట్టి తెప్పించాను. ఇదే సందర్భంలో జీళ్లచెరువు చెరువు నుంచి కూడా ఇరిగేషన్శాఖ అనుమతితో మట్టిని తోలించాం. అందుకు తగిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాం. ఈ విషయంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్కు గానీ, ఆలయ పాలకమండలి సభ్యులకు గానీ ఎలాంటి సంబంధం లేదు. జీళ్లచెరువు గుడికి వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించేందుకు నేను స్వయంగా రూ.కోటి ఇచ్చాను. బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసుల బనాయింపు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు. కక్షపూరిత చర్యలను ఎదుర్కొంటాం. పోరాడతాం. కుట్రలను తిప్పికొడతాం.