నగరంలో విషాదం
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన నగర పాలక సంస్థ
మామిళ్లగూడెం, జూన్ 7: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వాటర్ట్యాంక్లో ప్రమాదశావత్తు పారిశుధ్య కార్మికుడు పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, బంధువుల కథనం ప్రకారం.. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న చిర్రా సందీప్ (23) మంగళవారం నయాబజార్ పాఠశాల వద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు కార్మికులతో వచ్చాడు. ట్యాంకును శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిని సరఫరా చేసే పైపులో పడిపోయి లోపల ఇరుక్కున్నాడు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే నగరపాలక సంస్థ, అగ్నిమాపకశాఖ, పోలీస్శాఖ అధికారులు సందీప్ను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. కాగా, సందీప్ తండ్రి వీరబాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ సర్వయ్య తెలిపారు.
కుటుంబ నేపథ్యం ఇదీ..
చిర్రా వీరబాబు, భాగ్యలక్ష్మి స్వగ్రామం కామంచికల్. వారికి ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి 55వ డివిజన్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సందీప్ ఏడాది క్రితం కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య కార్మికుడిగా చేరాడు.
కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన
సందీప్ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, పలు సంఘాల నాయకులు ఘటనా స్థలంలో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేశ్ భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్డీవో రవీంద్రనాథ్, మున్సిపల్ సహాయ కమిషనర్ మల్లేశ్వరి, అర్బన్ తహసీల్దార్ శైలజ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఆర్థికసాయం ప్రకటించారు. నగరపాలక సంస్థ తరఫున బాధిత కుటుంబానికి రూ.6 లక్షల నగదు, నగర పరిధిలో ఇంటి స్థలం, బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, దళితబంధు పథకం వర్తింపచేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.