కూసుమంచి, జూన్ 26 : మండిపోతున్న ఎండలకు పాలేరు జలాశయంలోని నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో తాగునీటికి మళ్లీ ఇబ్బందులు తలెత్తుతాయేమోనని ఆందోళన చెందుతున్న తరుణంలో అధికారులు సాగర్ జలాశయం నుంచి గురువారం నీటిని వదిలారు. ఎడమ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని పాలేరు రిజర్వాయర్కు ప్రత్యేకంగా వదిలారు. దీంతో మరో రెండు నెలలపాటు మిషన్ భగీరథ ద్వారా దాదాపు 700 గ్రామాలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి.
మూడు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా తగ్గుతూ శుక్రవారం ఉదయానికి 12 అడుగులకు పడిపోయింది. సాగర్ నీటిని వదలాలని, లేదంటే మిషన్ భగీరథ మోటర్లకు నీటి ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ క్రమంలో తాగునీటి సమస్యపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి, సాగర్ డ్యాం నుంచి నీటిని ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు.
దీనికి సానుకూలంగా స్పందించి గురువారం నీటి విడుదలకు పూనుకున్నారు. దీంతో శుక్రవారం పాలేరు జలశయానికి సాగర్ నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతానికి వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రం వస్తోంది. శనివారం సాయంత్రం వరకు దీని ప్రవాహం పెరిగి 2,500 క్యూసెక్కులకు పైగా నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏప్రిల్, మే నెలలో పాలేరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జలాశయం అడుగంటి 6 అడుగులకు చేరింది. మళ్లీ అవే పరిస్థితులు నెలకొంటాయేమోనని అనుకుంటున్న తరుణంలో సాగర్ డ్యాం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో ఇక మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తొలగినట్లే అవుతుంది.