కూసుమంచి, జూన్ 4 : దంచికొడుతున్న ఎండల ప్రభావంతో పాలేరు జలాశయ నీటిమట్టం క్రమక్రమంగా తగ్గిపోతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతానికి 15.10 అడుగులకు పడిపోయింది. దీంతో మూడు జిల్లాలతోపాటు ఖమ్మం కార్పొరేషన్కు తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది.
నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల కాకపోతే మిషన్ భగీరథ ద్వారా 700 గ్రామాలకు కటకట ఏర్పడనున్నది. రెండేళ్ల క్రితం పాలేరు జలాశయం పూర్తిగా అడుగంటిపోయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. ఈ క్రమంలో మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖ అధికారులు జేసీబీల సహాయంలో కాల్వలు కొట్టి నీటిని మిషన్ భగీరథ పంపుహౌస్ వరకు మళ్లించారు. దీంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు పాలేరు ఇన్టేక్ వెల్ ద్వారా తాగునీటిని అందించారు.
ప్రస్తుతానికి నీటిని ఆయా ప్రాంతాలకు వినియోగిస్తుండటంతో పాలేరు జలాశయంలోని నీరు రోజుకు 0.20 అడుగుల మేర తగ్గుతోంది. ఇంకా 10 అడుగుల వరకు తగ్గితే మిషన్ భగీరథ మోటర్లకు నీరు అందని పరిస్థితి. ఇందుకోసం సాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటిని వదలాల్సి ఉంది. అయితే అక్కడ సాగర్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 30 శాతం కూడా సాగర్లో నీటి నిల్వలు లేవు. అయితే సాగర్ నుంచి నీరు రాకపోతే మరో 20 రోజుల్లో పాలేరు జలాశయం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడనున్నది. దీంతో పాలేరు జలాశయం డెడ్ స్టోరేజీకి పడిపోయే ప్రమాదం ఉంది.
700 గ్రామాలకు తాగునీటిని అందించే పాలేరు జలాశయంలోని నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సాగర్ నుంచి నీటిని విడుదల చేసి పాలేరు వరకు కాల్వలపై నిరంతరం గస్తీ ఏర్పాటు చేసి పాలేరుకు నీటిని మళ్లించాల్సి ఉంది. లేదంటే మరో 5 అడుగుల మేర నీటిమట్టం తగ్గితే తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడనున్నది.