మామిళ్లగూడెం, ఆగస్టు 1: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ పోస్టులకు కేటాయించినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పూర్తి పారదర్శకంగా, వీడియోగ్రఫీతో వీఆర్వోల కేటాయింపు ప్రక్రియను ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఆర్వోలను పూర్తి పారదర్శకంగా వివిధ శాఖలకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో 310 మంది వీఆర్వోలకు గాను ఖమ్మం జిల్లాలో 236 మందిని వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయించామన్నారు.
బీసీ సంక్షేమ శాఖకు 24, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు 12, ఉన్నత విద్యా శాఖకు 34, పోలీసు శాఖకు 13, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 41, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 15, ఎస్సీ సంక్షేమ శాఖకు 21, సెకండరీ విద్యా శాఖకు 12 మందిని కేటాయించినట్లు వివరించారు. మిగిలిన 74 మంది వీఆర్వోల్లో 15 మందిని మహబూబాబాద్ జిల్లాకు, 59 మందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించామన్నారు. ఆయా జిల్లాలకు కేటాయించిన వీఆర్వోలకు ఆ జిల్లాల కలెక్టర్ల ఉత్తర్వులను అనుసరించి పోస్టింగులు కేటాయించనున్నట్లు చెప్పారు. ఉత్తర్వులు పొందిన రోజునే కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహలత, మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏవో మదన్గోపాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.