కూసుమంచి, డిసెంబర్ 2: జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఓటర్లు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు చేశారు. ఓటు హక్కుపై తమ చైతన్యాన్ని చాటారు. నియోజకవర్గంలో పోలింగ్శాతం 90.91గా నమోదైంది. అలాగే అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో పోలింగ్ శాతం 92.85గా నమోదైంది. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని రేగుల తండా పోలింగ్ కేంద్రంలో 174 మంది ఓటర్లు ఉండగా 173 మంది ఓటు వేయడం విశేషం. జిల్లాలో ఇది ఒక రికార్డు. నియోజకవర్గవ్యాప్తంగా 289 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి కేంద్రంలోనూ 70 శాతం కంటే ఎక్కువ పోలింగ్శాతం నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలేరు ఓటర్లే జిల్లాలో అత్యధికంగా పోలింగ్శాతం నమోదు చేయడం విశేషం.
తిరుమలాయపాలెం మండలంలో 1- 64 వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 49,609 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 24,159 మంది. మహిళలు 25,444 మంది. వీరిలో 46,007 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 22,721 మంది. మహిళలు 23,286 మంది. పోలింగ్ శాతం 92.76 నమోదైంది. 55 పోలింగ్ కేంద్రాల్లో 85 శాతానికిపైన ఓట్లు పోల్ అయ్యాయి.
ఖమ్మం రూరల్ మండలంలో 65- 163 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 99 పోలింగ్ కేంద్రాల్లో 88,511 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 42,562 మంది. మహిళలు 45,946. వీరిలో 77,745 మంది ఓటు వేశారు. ఓటు వేసిన వారిలో పురుషులు 37,521 మంది. మహిళలు 40,222 మంది. మండలంలో 88.84 శాతం పోలింగ్ నమోదైంది. 82 పోలింగ్ కేంద్రాల్లో 85 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి.
కూసుమంచి మండలంలో 164 నుంచి 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 67 పోలింగ్ కేంద్రాల్లో 46,268 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 23,924 మంది. మహిళలు 45,946 మంది. మొత్తం 45,648 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 22,248 మంది. మహిళలు 23,442 మంది. పోలింగ్శాతం 92.65 నమోదైంది. 67 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 58 పోలింగ్ కేంద్రాల్లో 85 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి.
నేలకొండపల్లి మండలంలో 231 నుంచి 289 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 59 పోలింగ్ కేంద్రాల్ల పరిధిలో 48,905 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 23,489 మంది పురుషులు. 25,415 మంది మహిళలు. 45,410 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 21,968 మంది పురుషులు. 23,442 మంది మహిళలు. పోలింగ్శాతం 92.85 నమోదైంది. మొత్తం 49 పోలింగ్ కేంద్రాలో 85 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోల్ అవడం విశేషం.
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని రేగుల తండా 85వ నెంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో 174 మంది ఓటర్లు ఉండగా 173 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. అక్కడ పోలింగ్శాతం 99.43 నమోదైంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో కంటే ఇక్కడి పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్శాతమే అత్యధికం.