ఖమ్మం రూరల్, నవంబర్ 17: వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల నుంచి పాలేరులోని ప్రతి గ్రామం నుంచి కందాళకు మద్దతు పెరుగుతుండడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు సైతం అదే తోవ పడుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం తిరుమలయపాలెం మండలం బచ్చోడు తండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. మండలంలోని సాయిగణేష్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెజార్టీ సాధించే విధంగా పని చేయాలని సూచించారు.
ఖమ్మం రూరల్, నవంబర్ 17: మరోసారి మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ గెలిస్తే ప్రతి ఇంటికి సౌభాగ్యలక్ష్మి అందుతుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సతీమణి విజయమ్మ అన్నారు. శుక్రవారం మండలంలోని మంగళగూడెంలో విజయమ్మ కూతురు సర్పంచ్ యండపల్లి రాధికతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామంలో గడపగడపనూ తట్టి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ అందజేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సైదాబీ, సొసైటీ డైరెక్టర్ యండపల్లి రవి, వీరెల్లి నాగయ్య, ఉపేందర్తోపాటు మహిళలు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, నవంబర్ 17: మండలంలోని ఆరెంపుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సతీమణి కందాళ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలిసారిగా ఇంటంటి ప్రచారానికి విచ్చేసిన విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఊరి పొలిమెరలో మంగళ హారతులు ఇచ్చి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఆమె విస్తృతంగా గ్రామంలో పర్యటించారు. ఆపద వచ్చిందంటే చాలు ఆదుకున్న గొప్ప నాయకుడు కందాళకు తప్పకుండా అండగా నిలబడతామని ప్రతి గడప నుంచి వచ్చిన మహిళ భరోసా కల్పించారు. కార్యక్రమంలో నాయకులు బండి సతీశ్, చుంచు జానకిరాములు, చుంచు నారాయణ, నర్సింహారావు, అనంతరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 17: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే, పాలేరు బీఆర్ఎస్ సమన్వయ కర్త డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో రెండో రోజు శుక్రవారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారాన్ని సాగించారు. గిరిజనులకు స్వయం పాలనను అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్కు ప్రజల దీవెలను ఉన్నాయన్నారు. సాగు నీరు, విద్యుత్, విద్య, వైద్య రంగాలతోపాటు మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మహిళలు పాల్గొన్నారు.