ఖమ్మం, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారని, అనేక పదవులు అలంకరించారని, ఇంత అనుభవంలో ఖమ్మం నగరానికి ఆయన చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. ఖమ్మం నగరంలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ప్రముఖ వైద్యుడు డాక్టర్ గంగరాజు అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తుమ్మలకు మొదటి నుంచి తానొక్కడే బాగుపడాలని, మరొకరు బాగుపడకూడదనే ఉద్దేశాలు ఉంటాయని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి కూడా తుమ్మలే చేసినట్లు నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. తన హయాంలోనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. నగరాభివృద్ధితోనే నగరానికి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వచ్చాయన్నారు. తద్వారా ఎంతోమంది యువత ఉపాధి అవకాశాలు పొందారన్నారు. నగర పరిధిలోని నూతన కలెక్టరేట్ భవనం, ఐటీ హబ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ధంసలాపురం ఆర్వోబీ, నూతన బస్టాండ్, లకారం ట్యాంక్ బండ్, మున్సిపల్ రోడ్స్, ప్రధానాసుపత్రికి అనుసంధానంగా తల్లీ పిల్లల హాస్పిటల్, గొల్లపాడు చానల్ ఆధునీకరణ.. ఇలా అనేక పనులను ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థలు టెండర్లు వేసుకుని దక్కించుకున్నాయన్నారు. టెండర్ల ద్వారానే పనులు జరుగుతాయని, కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుందన్నారు. కానీ తుమ్మలకు ఈ విషయం తెలియకపోవడం శోచనీయమన్నారు. తనపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే తుమ్మల ఆ పనులకు తనకు సంబంధం ఉన్నట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి తుమ్మల వంటి విలువలు లేని నాయకుడిని ఓటమి పాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డాక్టర్ భాగం కిషన్ రావు, డాక్టర్ చైతన్య, డాక్టర్ సీతారాం, డాక్టర్ నవీన్, డాక్టర్ అనూష, డాక్టర్ ఆలూరి వంశీ, పాల్గొన్నారు.
రఘునాథపాలెం, అక్టోబర్ 30: మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం మండల పర్యటన నిమిత్తం కాన్వాయ్లో వెళ్తున్నారు. ఈక్రమంలో కోయచలక క్రాస్ రోడ్డు వద్ద రఘునాథపాలెం పోలీసులు కాన్వాయ్ను ఆపారు. మంత్రి వారికి సహకరిస్తూ కారు దిగారు. పోలీసులు అనంతరం కాన్వాయ్ను తనిఖీ చేసి ఆల్ క్లియర్ అని తేల్చారు. అనంతరం మంత్రి యథావిధిగా తన పర్యటనను కొనసాగించారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఉన్నారు.