కొత్తగూడెం సింగరేణి, జూలై 5 : ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 3 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ ఏడాది డిసెంబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, ఈ గనుల నుంచి కనీసం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం ఆయన సింగరేణి చేపట్టే కొత్త గనులపై ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థ ఈ ఏడాది కొత్తగా ప్రారంభించదలచిన వీకే ఓసీ మైన్ (కొత్తగూడెం), రొంపేడు ఓసీ (ఇల్లెందు), గోలేటి ఓసీ (బెల్లంపల్లి) గనులకు సంబంధించి ఇంకా మిగిలి ఉన్న అటవీశాఖ అనుమతులను తక్షణమే పొందేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అనుమతులను సాధించి వెంటనే డిసెంబర్ నెల నుంచి ఈ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని అన్నారు. వీకే వోసీ నుంచి వార్షిక ఉత్పత్తి లక్ష్యం 43 లక్షలు అయినప్పటికీ ఈ ఏడాది కనసీం 7 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని చెప్పారు.
రొంపేడు ఓసీ నుంచి 20 లక్షల టన్నులు కాగా 3 లక్షల టన్నులు, గోలేటి ఓసీ నుంచి 35 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా ఈ ఏడాది 5 లక్షల టన్నులు సాధించాలని అన్నారు. ఈ ఏడాది సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలంటే కొత్త గనుల నుంచి ఉత్పత్తి సాధించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రామగుండం కోల్ మైన్ను ఎంవీకే ఓపెన్ కాస్ట్ గని, మరో రెండు ప్రతి పాదిత ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన అనుమతులను సాధించేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు పోవాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ (పా) బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వరరెడ్డి, అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్రపాండే, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సీఎం జే.ఆల్విన్, జనరల్ మేనేజర్ కో ఆర్డినేషన్ ఎం.సురేష్, జీఎం మార్కెటింగ్ సూర్యనారాయణ, జీఎం సీపీపీ జక్కం రమేష్, జీఎం మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మల్లెల సుబ్బారావు, జీఎం ఎస్టేట్స్ రవిప్రసాద్, జీఎం (పీపీ) సాయిబాబు పాల్గొన్నారు.