కారేపల్లి, జూన్ 7 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 4వ తేదీన స్థానిక వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి గంగాదేవి గుట్టపై సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 15వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ శిలాఫలకానికి శంకుస్థాపన చేశారు.
దీనిలో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్ రూ.కోట్ల మట్టిని అమ్ముకుంటున్నాడు. దీంతో పచ్చని పర్యావరణాన్ని తలపించే తమ ఊరి గుట్టను అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నారని గుట్టకిందగుంపు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఆరాధించే దేవతలు గుట్టపై కొలువై ఉన్నారని, మట్టి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గుట్టను తవ్వకుండా చదునుగా ఉన్న వేరే ప్రదేశంలో గోదాం నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు మద్దతు తెలిపారు. గుట్టపై మట్టి తవ్వకాలను నిలిపివేసే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.