మహిళల బతుకమ్మ ఆటలు.. డప్పు వాద్యాల మధ్య కళాకారుల నృత్యాలు.. ఎమ్మెల్యేలకు స్వాగత సుమాంజలులు.. విజయోత్స పారిశుధ్య సిబ్బందికి సన్మానాలు.. నూతన పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు.. వెరసి గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ దినోత్సవం అద్భుతం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నిర్వహించిన వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. పలు పంచాయతీల్లో నూతన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైరా మండలం గొల్లపూడిలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, తల్లాడ మండలం రెడ్డిగూడెం, మంగాపురంలో సండ్ర వెంకటవీరయ్య, చింతకానిలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం రూరల్లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, కామేపల్లి మండలం రామకృష్ణాపురం, రుక్కితండా, జగన్నాథ తండాలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పాల్గొని పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
– ఖమ్మం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పల్లెప్రగతి దినోత్సవ వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామాల్లో ప్రజలు, స్థానిక అధికారులు, పంచాయతీల పాలకవర్గ సభ్యులు పెద్దఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అధికారులు, ప్రజాప్రతినిధులు మెమోంటోలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ విస్తృతంగా పర్యటించారు. నూతనంగా నిర్మాణం చేపట్టబోయే పంచాయతీ భవనాలనిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాతనే పంచాయతీలకు నూతన ఒరవడి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలంలోని రెడ్డిగూడెం, మంగాపురం గ్రామాల్లో జరిగిన పల్లెప్రగతి దినోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. అందంగా అలంకరించిన పంచాయతీ వాహనాల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు అదనపు కలెక్టర్ స్నేహతల మొగిలి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంజూరైన పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన శుంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా సాగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు నాయకులు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలోని గొల్లపుడిలో జరిగిన పల్లెప్రగతి దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ హాజరయ్యారు. మధిర నియోజకవర్గం చింతకానిలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు హాజరయ్యారు.