ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం అకాలవర్షం కురిసింది. ఆయా వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన ఈ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. పంటలు నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లపై రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా వైరా మండలంలో ధాన్యం తడిసిపోయింది. దానిని కాపాడుకునేందుకు రైతులు పరుగులుపెట్టారు. టార్పాలిన్లు తెచ్చి కప్పారు. దాదాపు అన్ని చోట్లా చాలాసేపటి వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకూ భగభగమండినట్లుగా ఉన్న ఎండతీవ్రత క్రమంగా తగ్గుతూ వచ్చింది. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ తరువాత ఈదురుగాలలతో వాన మొదలైంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వైరా మండలం దాచాపురం, గన్నవరం గ్రామాల్లో రోడ్ల వెంబడి ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి నీటిపాలైంది.
దీంతో, పంట చేతికొచ్చి నెల రోజులైనా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లనే తమ ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, వడ్డె రంగాపురం, కోయరంగాపురం, నందిపాడు గ్రామాల్లో బలమైన గాలులు వీచాయి. గుమ్మడవల్లిలో తాళ్లూరి నాగేశ్వరరావు ఇంటి గోడ కూలిపోయింది. బత్తుల రాజు ఇంటి పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. కరకగూడెం, చర్ల మండలాల్లో కరెంట్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. రేగుళ్ల గ్రామంలో పిడుగుపాటుకు రెండ్లు ఎద్దులు మృతిచెందాయి. అంగారుగూడెంలో సుమారు 20 ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల్లో మామిడితోటలో ఉన్న మామిడికాయలు రాలిపోయాయి. మిర్చి పంటలు తడిచిపోయాయి. పినపాక మండలం తోగ్గూడెంలో బూరిక చరణ్ పూరిల్లు పైకప్పు ఎగిరిపోయింది. పూలచిలక గ్రామంలో పూనెం బాలకృష్ణ అనే రైతుకు చెందిన పాడి గేదె మృతిచెందింది. ఎంపీడీవో కార్యాలయం వద్ద చెట్లు విరిగిపడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తాటి చెట్టుపై పిడుగు పడింది.