ఖమ్మం, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇసుక రవాణా, తవ్వకాలపై అనాధికార నిషేధం కొనసాగుతున్నది. దీంతో అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. కొందరైతే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రా నుంచి ఇసుక తెచ్చి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇసుక ధరల పెరుగుదల చూసి బిల్డర్లు, తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఇసుక తరలిస్తుండడంతో రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఆదాయానికీ గండిపడుతున్నది. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి చీమ కుట్టినైట్లెయినా లేకపోవడం విచారకరం. కేసీఆర్ ప్రభుత్వంలో సరైన ఇసుక పాలసీ అమలు కావడం, బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపడం, అక్రమార్కుల ఆగడాలను కట్టడి చేయడంతో సాఫీగా నిర్మాణ రంగం ముందుకు సాగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పెద్ద మండవ, గంధసిరి, చింతకాని మండలంలోని చిన్న మండవ, ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల్లోని పలు గ్రామాలు, వైరా మండలంలోని కట్టలేరు ప్రాంతంలో ఇసుక అందుబాటులో ఉంది. జిల్లాలో నిర్మాణాలన్నింటికీ ఇక్కడి ఇసుకే ప్రధానం. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో భారీ కట్టడాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణానికి చింతకాని, ముదిగొండ మండలాల్లో లభించే ఇసుకే ఆధారం. సాధారణంగా రీచ్ల నుంచి ఇసుక తరలించాలంటే వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయం నుంచి కూపన్లు తీసుకోవాల్సి ఉన్నది. కానీ అక్రమ రవాణాకు అలవాటు పడిన అక్రమార్కులు దొడ్డిదారిన ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. రీచ్ల నుంచి ప్రతిరోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపే ఇసుక తరలించాల్సి ఉన్నప్పటికీ అక్రమార్కులు 24 గంటల పాటూ ఇసుక తరలిస్తున్నారు. ఆ ఇసుకను ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డ్ బ్రిడ్జి, రూరల్ మండలం పరిధిలోని కరుణగిరి ఎదురుగా ఉన్న వెంచర్లలో డంప్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కృత్రిమ కొరతను సృష్టించి అక్కడి నుంచి ఎక్కువ ధరలకు వినియోగదారులకు ఇసుక అందిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమ ఇసుక రవాణాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగలేదు. దీంతో కట్టడాలు నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ అలసత్వాన్ని అలుసుగా తీసుకుని అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో ఇసుక విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో టన్ను ఇసుక రూ.750- రూ.900 మధ్య లభించగా ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.1,800 నుంచి రూ.2,000 వరకు పలుకుతున్నది. ఒక చిన్న డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించాలంటే కనీసం 70 నుంచి 80 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ఇంటి నిర్మాణానికి గతంలో ఇంటి యజమానులు ఇసుక కోసం కేవలం రూ.72 వేలు చెల్లించగా ప్రస్తుతం ఆ ధర రూ.1.60 లక్షల వరకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక పాలసీని అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్వారీలు లేకపోవడం వల్ల ఇసుక రేటు బాగా పెరిగింది. గతంలో మణుగూరులో నాలుగు క్వారీలు ఉండేవి. ఇప్పుడు ఒక్కటే క్వారీ నడుస్తున్నది. ఇసుక రేటు తగ్గితేనే సామాన్యులు నిర్మాణాలు చేస్తుంటారు. పక్కనే గోదావరి, వాగులు ఉంటే ఇసుక అధిక ధరకు ఎలా కొంటారు. రాత్రుళ్లు లారీలకు లారీలు ఇసుక వెళ్తున్నది. పగలు ఒక ట్రాక్టర్ కూడా బయటకు రాదు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చూడాలి.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : గోదావరి నదీతీరం, ఎక్కడపడితే అక్కడ వాగులు, ఇసుక రీచ్లకు కొదవ లేకపోవడంతో జిల్లాలో కావాల్సినంత ఇసుక ఉంది. అయితే అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తుండడంతో ఇసుక రేట్లు బాగా పిరమయ్యాయి. దీంతో భవన నిర్మాణాలు భారమయ్యాయి. గత ప్రభుత్వం అమలుచేసిన ‘మన ఇసుక వాహనం’ కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతుండడంతో ఇసుకకు యమ డిమాండ్ పెరిగింది. దీంతో ఇసుక దందా రోజురోజుకూ పెరిగిపోతున్నది. పక్కనే ఉన్న ఆంధ్రా నుంచి సైతం ఇసుకను తెచ్చి ఇక్కడ అధిక ధరకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తుండడంతో ఇసుక వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇసుక అక్రమ రవాణా మరింత జోరందుకున్నది. లోకల్ ఇసుక వాహనాలు సైతం విచ్చలవిడి అయ్యాయి. రాత్రిళ్లు ఇసుక ట్రాక్టర్లు రయ్య్ మంటూ పరుగులు పెడుతున్నా అధికారులకు కనిపించడం లేదు.
ఇసుక రేటు బాగా పెరిగిపోయే సరికి భవన నిర్మాణాలకు భారం పెరిగింది. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.2వేలు ఉంటే ఇప్పుడు రూ.6వేల వరకు పలుకుతున్నది. ఇసుక లేకుండా నిర్మాణాలు జరగవు కాబట్టి ఇసుక మీరు తెచ్చుకోండి.. మేము గతంలో ఉన్న రేటుకు కట్టిపెడతాం అంటున్నారు కాంట్రాక్టర్లు. దీంతో ఇంటి యజమానులు చేసేదేమీలేక మేస్త్రీలు అడిగిన రేటు ఇచ్చి నిర్మాణాలనుసాగిస్తున్నారు.
సామాన్యులు సైతం ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘మన ఇసుక వాహనం’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాగుల్లో ర్యాంపులను ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరిపించే ప్రక్రియ వల్ల తక్కువ రేటుకే ఇసుక ఇంటివద్దకు వచ్చేది. గతంలో జిల్లావ్యాప్తంగా 13 ఇసుక ర్యాంపులు ఉండేవి.. ప్రస్తుతం ఒక్క ర్యాంపును కూడా ప్రారంభించకపోవడంతో మన ఇసుక వాహనాలు అడ్రస్ కనిపించడం లేదు. దీంతో అక్రమార్కులు ఎడ్లబండ్లు, రాత్రుళ్లు తోలే అక్రమ ఇసుక సామాన్యులపై పెనుభారం పడుతున్నది. ఇసుక వాహనం ద్వారా వెయ్యి రూపాయలు ఉంటే అక్రమంగా అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. కొత్తగూడెంలో సాటివారిగూడెం, చాతకొండ ర్యాంపులు అనుమతులు వచ్చినా వాటిని ప్రారంభించకపోవడం వల్ల ఇసుక డిమాండ్ విపరీతంగా పెరిగింది. జిల్లాలో ఇసుక రీచ్లు కూడా పర్మిషన్లు లేకపోవడంతో మణుగూరులో ఉన్న నాలుగు క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో అక్కడ కూడా గోదావరి ఇసుకకు డిమాండ్ పెరిగింది.
పక్కనే గోదావరి ఉన్నా భద్రాచలం పట్టణం నుంచి బూర్గంపాడు మండలాల వరకు ఆంధ్రా ఇసుక దందా కొనసాగుతున్నది. విపరీతమైన ధరలకు విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రాలో గుండాల ఇసుక రీచ్ కొన్నిరోజులు బంద్ చేసి మళ్లీ యథావిధిగా కొనసాగిస్తుండడంతో భద్రాచలంలో అక్రమ రవాణా మరింత పెరిగింది.