ఖమ్మం కల్చరల్, మార్చి 22: శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పండుగను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది పండుగను ప్రజలు ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా జరుపుకున్నారు. తొలి తెలుగు సంవత్సరం ప్రారంభంకావడంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గృహాల్లో మామిడితోరణాల అలంకారాలు అత్యంత శోభాయమానమై చైత్రమాస విశిష్టతను చాటాయి. తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు ఆచరించి, గృహాలను మామిడి తోరణాలతో అలంకరించుకుని పూజలు చేశారు. అనంతరం ఆరు రుచుల ఉగాది పచ్చడిని తయారు చేసుకుని సేవించారు.
ఈ షడ్రుచుల పచ్చడి జీవిత సారాన్ని చాటుతుందని, ఆరోగ్యం, ఆధ్యాత్మికతను పెంచుతుందనేది ప్రజల నమ్మకం. తమ ఇష్టదైవాలను దర్శించుకునేందుకు ప్రజలు పలు ఆలయాలకు తరలివెళ్లారు. ఆలయ ప్రాంగణాలు, పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో తమ రాశులను బట్టి ఆదాయ వ్యయాలను, రాజపూజ్యాలను, అవమానాలను తెలుసుకున్నారు. నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం, కమాన్బజార్ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఎన్ఎస్పీ రామాలయం, గుంటుమల్లేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు. కూసుమంచి శివాలయంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ దంపతులు, కొత్తగూడెం విఘ్నేశ్వర ఆలయంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ దంపతులు, పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దంపతులు, కామేపల్లి మండలం కొత్తలింగాల కోటమైసమ్మతల్లి ఆలయంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ప్రత్యేక పూజలు చేశారు.