వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఐదుగురు మృతి చెందారు. రైలు ఢీకొని కీమేన్.. పొలం దున్నుతూ గుండెపోటుతో రైతు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, మరో వ్యక్తి మృతిచెందారు.
-నెట్వర్క్
ఇద్దరు యువకుల దుర్మరణం
రఘునాథపాలెం, జనవరి 1: నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్నది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్నది. మద్యం మత్తులో ఉన్న యువకుల ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వేగంగా వెళ్లి ఓ ఇంటి మెట్లను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యువకులిద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై మాచినేని రవి తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం గ్రామానికి చెందిన పందుల సాయి(23), పాండురంగాపురానికి చెందిన కట్ల పుల్లారావు(23) పెయింటింగ్ పనులు చేస్తుంటారు.
న్యూ ఇయర్ సంబురాలను శనివారం అర్ధరాత్రి వరకు తమ స్నేహితులతో కలిసి పాండురంగాపురంలో జరుపుకున్నారు. అర్ధరాత్రి 1:30 గంటల తరువాత సాయిని ఇంటి వద్ద దింపేందుకు పుల్లారావు తన పల్సర్ బైక్పై ఎక్కించుకొని వెళ్తున్నాడు. రఘునాథపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోగానే ఇసుక అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ ఇంటి మెట్లను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2:20 గంటల సమయంలో సాయి, పుల్లారావు మృతిచెందారు. సాయి రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. పుల్లారావుకు ఏడాది క్రితం వివాహం కాగా ప్రస్తుతం భార్య గర్భవతి. వీరి మృతి ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గుండెపోటుతో రైతు..
కూసుమంచి రూరల్, జనవరి 1: ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రైతు ఉన్నట్టుండి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటన మంగలితండా పంచాయతీ శివారు బికారితండాలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. తండాకు చెందిన తేజావత్ రామా (52) ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నడానికి వెళ్లాడు. ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా గుండెనొప్పి వచ్చింది. ట్రాక్టర్ అదుపుతప్పుతున్నదని గమనించిన రైతు వెంకటరెడ్డి ట్రాక్టర్ను నిలిపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక రైతులు రామాను ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా రామా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు వెంకటరెడ్డి ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రామా మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రామా మృతదేహాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి దంపతులు సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.
పాల్వంచ పట్టణంలో వ్యక్తి..
పాల్వంచ, జనవరి 1: ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం అర్ధరాత్రి పాల్వంచ పట్టణంలో చోటుచే సుకున్నది. పట్టణ ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రశాంతినగర్ కాలనీకి చెందిన రాపోలు రమేశ్ (42) అనే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పనినిమిత్తం జగన్నాథపురం వెళ్లి తిరిగి పట్టణానికి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని సీఎస్ఐ చర్చి వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుడికి భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రైలు ఢీకొని రైల్వే కీమేన్..
చింతకాని, జనవరి 1: రైలు ఢీకొట్టి రైల్వే కీమేన్ మృతిచెందిన ఘటన పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. జీఆర్పీ ఎస్సై భాస్కర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలంలోని బర్లగూడేనికి చెందిన పందిళ్లపల్లి సెక్టార్లో రైల్వే కీమేన్గా విధులు నిర్వర్తిస్తున్న మాళోత్ రాజేందర్ (34) ఆదివారం తెల్లవారుజామున రైలుపట్టాలను తనిఖీ చేస్తున్నాడు. పొగమంచు కారణంగా రాజేందర్కు వెనుక వస్తున్న రైలు కనిపించలేదు. రైలు ఢీకొని రాజేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతూ యువకుడు..
టేకులపల్లి, జనవరి 1: పాతర్లగడ్డకు చెందిన తాటి కిరణ్ (22) అనే యువ రైతు కుటుంబ కలహాల నేపథ్యంలో గత నెల 29న పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి వైద్యం చేయిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కిరణ్ మృతిచెందాడు.