డ్రైవర్లు, కండక్టర్లకు సంస్థ చైర్మన్ గోవర్ధన్ సూచనలు
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని సూచించారు. రాష్ట్రంలో వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో డ్రైవర్లందరూ భద్రత సూచనలు పాటించాలని కోరారు. బుధవారం హైదరాబాద్లోని బస్భవన్లో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు.ఆర్టీసీ సంస్థలో సుశిక్షితులైన డ్రైవర్లు ఉన్నారని, అయినా వర్షకాలంలో మరోసారి భద్రత నియమాలను మననం చేసుకుని తూచ తప్పకుండా పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరమన్నారు.
ఆర్టీసీ, డ్రైవర్లు పాటించాల్సిన సూచనలు..
వర్షం కురుస్తున్నప్పుడు వేగ నియంత్రణ పాటించాలి. మలుపుల వద్ద ఇండికేటర్ను ఉపయోగించాలి. ముందు వెళ్లే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటించాలి. దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ ఉపయోగించాలి. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయనప్పుడు వైపర్ వాడాలి. హెడ్లైన్ను లోబీమ్లో ఫాగ్ లైట్స్ తప్పనిసరిగా వాడాలి. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు.బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి. చెరువులు , కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. నదులు, కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దు. విండ్స్క్రీన్ గ్లాసులను వైపర్తో బయటవైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్తో శుభ్రపరచాలి.
డ్యూటీకి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్లైట్స్ పనితీరు పరిశీలించుకోనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయంలో సమీప బస్స్టేషన్ నందు ఆపుకొని నీళ్లతో ముఖం, కాళ్లు, చేతులు శుభ్రపరచుకోవాలి. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించాలి. డ్యూటీకి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు. అకస్మాత్తుగా సడన్బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునప్పుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కనుక ఎట్టి పరిస్థితుల్లో రాంగ్రూట్లో వెళ్లరాదు. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు. అకస్మాత్తుగా బస్సు దిశను మార్చకూడదు. అతివేగంగా బస్సును నడపరాదు. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కనుక సడన్గా ఇండికేటర్ వేయకూడదు.
బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఎయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి. ఘాట్రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును న్యూట్రల్ చేసి నడపకూడదు. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో మ్యాన్హోల్స్ , రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపాలి. బస్సులో ఫుట్బోర్డు ప్రయాణాన్ని నివారించాలి. ఫుట్బోర్డులో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి. నగరంలో నడిచే బస్సును ప్రయాణికులు ఎక్కకుండా చూడాలి. ఫోన్ మాట్లాడుతూ ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు.తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదని సూచించారు. ఎంతో పేరున్న ఆర్టీసీ సంస్థ.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, డ్రైవర్లు, కండక్టర్ సురక్షితంగా బస్సులు నడిపి..ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ సూచనలు జారీ చేశారు.