“కేంద్రం దిగివచ్చి యాసంగిలో రైతులు పండించిన వడ్లు కొనే వరకు పోరుదారి వీడబోం.. కర్షకులను అరిగోస పెడుతున్న బీజేపీ సర్కార్కు పుట్టగతులుండవ్.. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం”. అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వ హించారు. రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరై కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదన్నారు. ఎనిమిది ఏండ్లుగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటించారని, దీన్ని బట్టి రైతు అనుకూల విధానాలను ఎవరు అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందన్నారు.
– ఖమ్మం, ఏప్రిల్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖమ్మం
కేంద్రం యాసంగిలో పండించిన ధ్యాన్యాన్ని కొనుగోలు చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. గురువారం ఖమ్మంలోని ధర్నాచౌక్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టులు నిర్మించలేదని, సీఎం కేసీఆర్ తెలంగాణలో మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. అర కిలోమీటర్ ఎత్తుకు గోదావరి జలాలను ఎక్కించి రాష్ట్రంలో లక్షల ఎకరాలను సమస్యశ్యామలం చేశారన్నారు. ఎనిమిది ఏండ్లుగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్లో ఓ కేంద్ర మంత్రి ప్రకటించారని, దీన్ని బట్టి రైతు అనుకూల విధానాలను ఎవరు అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందన్నారు. ఆయనపై కక్ష్య సాధించాలని బీజేపీ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.
రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని పెద్దలు చెప్పారని, అలాగే రైతులను ఏడిపించిన బీజేపీకి త్వరలో తగిన శాస్తి జరుగుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం, పవర్ హాలీ డే ఉన్న సమయంలో రాష్ట్రంలో 24 గంటల పాటు ఉచితంగా పంటలకు విద్యుత్ సరఫరా అవుతున్నదన్నారు. రైతుబంధు ద్వారా 63 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.50 వేల కోట్లు జమ చేశారన్నారు. గడిచిన రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశారన్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీలో రాష్ట్ర ఆహారశాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలవడానికి రాష్ట్రం మంత్రులం వెళ్తే హీనంగా మాట్లాడారన్నారు. అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి రైతు తమ ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలపాలని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు నూకలు అలవాటు చేయాలని ఉచిత సలహా ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకే ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా రైతులు పండించిన ఆహారాన్నే తినాల్సి ఉందన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామన్నారు. ప్రభుత్వం ఇతర పంటలపై అవగాహన కల్పించినందుకే ఏటా 54 లక్షల ఎకరాలు ఉండే వరి సాగు విస్తీర్ణం ఇప్పుడు 34 లక్షలకు చేరిందన్నారు. యాసంగిలో వరి వేయొద్దని ప్రజాప్రతినిధులు ఊరూరా తిరిగి రైతులకు అవగాహన కల్పించినప్పుడు బీజేపీ నేతలు వరి వేయాలని రైతులను తప్పుదోవ పట్టించారన్నారు. ఇప్పుడు ఆ నేతలు ఏమీ మాట్లాడడం లేదన్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనిపించే బాధ్యత తనది అన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కేంద్రం పంజాబ్, హర్యానాలో ధాన్యం కొంటున్నట్లు గానే తెలంగాణ నుంచీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయకుండా బీజేపీ తన తప్పు తెలుసుకుని ధాన్యం కొనాలన్నారు. 11న సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, టీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదన్నారు. పంజాబ్ తరహాలో ఇక్కడి రైతులు పండించిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచుఉ్చ విజయ్కుమార్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జిల్లా చింతనిప్పు కృష్ణ చైతన్య, సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఉమామాహేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, నాయకులు కమర్తపు మురళి, మాటేటి కిరణ్, దేవభత్తిని కిశోర్, తాజుద్దీన్, సాదు, కొల్లు పద్మ, షకీనా, బల్లెం వేణు, ప్రసాద్, డోకుపర్తి సుబ్బారావు, శేషు, మందడపు సుధాకర్, రామబ్రహ్మం, బిచ్చాల తిరుమలారావు, మేకల సుగుణారావు, బలుసు మురళీకృష్ణ , స్వర్ణకుమారి, చిత్తారు సింహాద్రియాదవ్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.
ధర్నాకు విశేష స్పందన..
మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచి టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. దీక్షకు తరలివచ్చిన వారికి పార్టీ నగర కమిటీ మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వరి కంకులతో చేసిన గొడుగు వేసుకుని ధర్నాకు రావడం అందరినీ ఆకట్టుకున్నది. మంత్రి అజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులూ వరి కంకులను దండగా ధరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కళాకారులు జాన్, పరకాల అజయ్ పాడిన పాటలు రైతులను ఆకట్టుకున్నాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆ పాటలకు స్టెప్పులు వేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ
సీఎం కేసీఆర్ తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాల కారణంగా ఇప్పుడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నది. కేంద్రం రాష్ట్ర రైతులపై వివక్ష చూపుతున్నది. దేశవ్యాప్తంగా పండించిన ధాన్యాన్ని కేంద్రమే ఎఫ్సీఐ ద్వారా సేకరించాల్సి ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఒక్కో రాష్ర్టానికి ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నది. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వమే వేల టన్నుల ధాన్యం సేకరించింది. మోదీ ప్రభుత్వం మాత్రం రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. పంటల మార్పిడిని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం రైతులు వరి సాగు చేయాలని సూచించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం స్పందించడం లేదు.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి..
రైతుల జోలికి వచ్చిన కేంద్రానికి బుద్ధి చెప్పాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వాటన్నింటినీ సాధించుకున్నాం. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకపోవడం, రైతు ఆత్మహత్యలు లేకపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. రైతులపై వివక్ష చూపుతున్నది.
– లావుడ్యా రాములునాయక్, వైరా ఎమ్మెల్యే
ఒకే దేశం.. ఒకే కొనుగోలు విధానం ఉండాలి..
తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్తమీ కాదు. నైజాం పాలనకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర ఇక్కడి ప్రజలకు ఉంది. కేంద్రం ధాన్యం కొనకపోతే పోరాటం ఉధృతమవుతుంది. ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట చెప్తున్నారు. మున్ముందు వారికి ప్రజలే బుద్ధి చెప్తారు.
– లింగాల కమల్రాజు, జిల్లా పరిషత్ చైర్మన్
ఢిల్లీ మెడలు వంచి తీరుతాం..
తెలంగాణపై సవతి ప్రేమ చూపుతున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా మెడలు వంచుతాం. ఒకే దేశం, ఒకే కొనుగోలు నినాదంతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. రైతు వ్యతిరేక చట్టాలపై పంజాబ్ రైతులు ఉద్యమం చేపట్టగానే కేంద్రం వెనక్కి తగ్గింది. మళ్లీ అలాంటి ఉద్యమం చేసే పరిస్థితి వచ్చింది. రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలవాలి.
– తాతా మధు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం
రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు. రైతులను గోస పెట్టిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. సీఎం కేసీఆర్ రెండేళ్ల నుంచి యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయమని సూచిస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం వరి వేయాలని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం స్పందించడం లేదు.
– కందాళ ఉపేందర్రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే