బోనకల్లు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా రైతుబంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు కేంద్రంలో ఒక మాట రాష్ట్రంలో బీజేపీ నేతలు ఒక మాట చెబుతూ రాష్ట్రం రైతాంగాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారన్నారని పేర్కొన్నారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసి యాసంగిలో పండే వడ్లను కొనుగోలు విషయంలో తేల్చి చెప్పాలని అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా మాటలు దాటేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతాంగానికి పెద్దపీఠ వేసి వారికి వ్యవసాయ రంగంలో అన్ని రకాలుగా అండగా ఉంటుంటే రైతులను తెరాస సర్కారుకు దూరం చెయ్యాలని అక్కసుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు మందలపు తిరుమలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగు నాగేశ్వరరావు, రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్, రైతుసంఘం అధ్యక్షుడు కాకాని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి షేక్ పెంటూషా, మధిర మార్కెట్ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, జిల్లా రజకసంఘం అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మయ్య, కార్మికసంఘం అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు యంగల కనకయ్య, ఎస్టీసెల్ అధ్యక్షుడు మూడావత్ సైదా, మాజీఅధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మాజీజడ్పీటీసీ బాణోతు కొండ, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, బోనకల్లు సర్పంచ్ సైదానాయక్, జానకీపురం సర్పంచ్ వెంకటేశ్వర్లు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జెర్రిపోతుల రవి, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.