టీఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు
తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు
దళితబంధు దేశానికే ఆదర్శం
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
అశ్వాపురం, జూలై 6: ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మండలంలోని మొండికుంట కేవీఆర్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశంలో మరెక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని అన్నారు.
పినపాక నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులకు ఎలాంటి కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. దళితబంధు పథకం దేశానికి ఆదర్శకంగా నిలుస్తోందన్నారు. ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షలుఅందించే ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు.