కొత్తగూడెం అర్బన్, జూన్ 12 : అటవీ శాఖ ఆధీనంలో ఉన్న అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోని భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గురువారం భద్రాద్రి కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ రామన్నగూడెంకు చెందిన దాదాపు 150 కుటుంబాలు సర్వే నంబర్ 30, 36, 39లోని భూముల్లో తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాయని తెలిపారు.
వారికి ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం ఇచ్చిందని, అయినా లంకలపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ ఇదే అని, ఇది అటవీ శాఖ భూమి అని ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో హైకోర్టు సైతం సాగు చేసుకుంటున్న 573 ఎకరాలు ఆదివాసీలదేనని స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టు తీర్పును అధికారులు అమలు చేయడం లేదని ఆరోపించారు. కలెక్టర్ జాయింట్ సర్వే చేయించి ఆదివాసీల భూములు అప్పగించాలని కోరారు.
అలాగే రామన్నగూడెంలో మంజూరైన నాలుగు ఇందిరమ్మ ఇండ్లను సైతం గిరిజనేతరులకు కేటాయించి పీసా చట్టాన్ని తుంగలో తొక్కారని, ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. ఆందోళన విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారి వద్దకు చేరుకొని సమస్యను సావధానంగా విన్నారు. కలెక్టర్కు సమస్యను వివరించి పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆదివాసీల ఆందోళనకు ఆదివాసీ హక్కుల సంఘం, తుడుందెబ్బ నాయకులు వాసం రామకృష్ణ దొర, ఆరెం ప్రశాంత్ తదితరులు సంఘీభావం తెలిపారు.