భద్రాచలం, జనవరి 2 : ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు 10/10 సాధించేలా ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ముఖ్యంగా ఇల్లెందు డివిజన్ పరిధిలోని 13 ఆశ్రమ పాఠశాలలు, 3 హాస్టళ్లు, 7 పీఎంహెచ్ హాస్టళ్లలో విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాలన్నారు. సబ్జెక్టు టీచర్లు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని చెప్పారు.
వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు వారికి స్లిప్ టెస్ట్, వీక్లీ టెస్ట్ నిర్వహించాలని సులభ పద్ధతిలో ఇంగ్లిష్, మ్యాథ్స్ చేయించడానికి రూపొందించిన వీడియోగ్రాఫ్ను తప్పనిసరిగా పిల్లలకు నేర్పించాలని చెప్పారు. ముఖ్యంగా ఈ గ్రేడ్ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కంప్యూటర్, ప్రొజెక్టర్ సాయంతో ప్రతిరోజూ విద్యార్థులకు బోధించడానికి ప్రత్యేక టీచర్ను నియమించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఇల్లెందు ఏటీడీఏ రూపాదేవి, జీసీడీవో అలివేలు మంగతాయారు, రమణమూర్తి, పోశాలు, హెచ్ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు.