Vegetables | కూసుమంచి రూరల్, ఏప్రిల్ 16 : స్వల్ప కాలిక పంటలతోపాటు అధిక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు. కాయ, ఆకు కూరల సాగుతో చిన్న, సన్నకారు గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారు. మండలంలో ప్రధానంగా గిరిజన రైతులు అనాదిగా తమకున్న భూమిలో 5 నుంచి 10 కుంటల్లో కూరగాయలు సాగు చేసి ఊరూరా తిరిగి అమ్ముకుని ఆదాయాన్ని పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిదేళ్ల కాలంలో సాగునీటి సౌకర్యంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే మార్కెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో సాగు విస్తీర్ణం పెంచుకుని దిగుబడులు సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. మండలంలోని లోక్యాతండా, కోక్యాతండా, ధర్మాతండా, దేవునితండా, గంగబండతండా, రావిచెట్టుతండా, మునిగేపల్లి, చేగొమ్మ, ముత్యాలగూడెం, కేశవాపురం తదితర గ్రామాల పరిధిలోని రైతులు కాయ, ఆకుకూరలను ఇతర సాంప్రదాయ పంటలతోపాటు సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సీజన్లవారీగా కాయ, ఆకుకూరలను పండించి సమీప గ్రామాల్లోని సంతల్లో విక్రయిస్తున్నారు.
వారానికి మూడు రోజులు కూసుమంచి, పాలేరు, నాయకన్గూడెంలో జరిగే సంతలతోపాటు దిగుబడి అధికంగా వచ్చినప్పుడు ఖమ్మం, పిండిప్రోలు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా వంటి దూర ప్రాంతాలకు కూడా తమ పంటలను తీసుకెళ్లి విక్రయిన్నట్లు పలువురు రైతులు చెప్పారు. ఆగస్టు నుంచి బెండ, వంగ, దోస, కాకర, సోర వంటి కాయగూరల సాగు చేస్తారు. ఎక్కువగా 5 నుంచి 10 కుంటల భూమిలోనే కూరగాయల సాగు చేస్తుంటారు. ఇదే భూమిలో ఒక పంట పూర్తయ్యాక మరో కూరగాయ లేదా ఆకుకూరలను జూన్ నెల వరకు సాగు కొనసాగిస్తుంటారు. ఆయా పంటల సాగుతో వారంలో మూడు రోజులు సుమారు రూ.10వేల వరకు ఆదాయాన్ని పొందుతారు. మిర్చి, పత్తి, వరి పంటల కంటే కాయ, ఆకుకూరల సాగు వల్ల స్వల్పకాలంలో పంట చేతికి వచ్చి, ఆదాయం వస్తున్నందున ఇంటిల్ల్లిపాదీ కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలా సంతల్లో విక్రయాల వల్ల వారానికి మూడు రోజులపాటు వచ్చే ఆదాయం పత్తి, మిర్చి పంట పెట్టుబడులు, కూలీల ఖర్చుకు వినియోగిస్తున్నారు.
చీడ సోకకుండా జాగ్రత్తపడాలి
ఆకు, కూరగాయల సాగు లాభదాయకమే. మా తాతల కాలం నుంచి కాయ, ఆకుకూరల సాగు చేస్తున్నాం. మాకున్న ఐదెకరాల భూమిలో అరెకరం నుంచి ఎకరం వరకు కూరగాయల సాగుకు కేటాయిస్తాం. కొద్ది రోజుల్లోనే చేతికొచ్చే పంటలైనా చీడ సోకకుండా జాగ్రత్త పడతాం. తొమ్మిదేళ్లుగా సాగునీటి సౌకర్యం పెరిగింది. దగ్గరలోని సంతల్లో సులువుగా అమ్ముకుని అదనపు ఆదాయం పొందుతున్నాం.
-జర్పుల కృష్ణ, రైతు, ధర్మతండా
కౌలు రేట్లు పెరిగాయి
ఇరవై ఏళ్ల నుంచి భూములు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా. ఇప్పుడు సాగునీటి సౌకర్యం పెరిగింది. కౌలు రేట్లు కూడా పెరిగాయి. ఎకరం భూమిని రూ.25వేల చొప్పున నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అరెకరంలో ఆకు కూరలు, కూరగాయల పంటలు సాగు చేశాను. కాకర, బీర, వంగ సీజన్ అయిపోయింది. ఇప్పుడు గోరు చిక్కుడు, సోర, తోటకూర, పాలకూర, కరివేపాకు సాగు చేశాను.
-జర్పుల మత్రిన్, కౌలు రైతు, లోక్యాతండా