కారేపల్లి, ఆగస్టు 15: ఖమ్మం జిల్లా సింగరేణి (Karepalli) మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుపల్లి సమీపంలోని బుగ్గ వాగుపై ఉన్న వంతెన పైనుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలోని ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఒడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వరద తాకింది. క్రమంగా వరద పెరుగుతుండటంతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. అదేవిధంగా లలితాపురం చెరువు అలుగు పోస్తుండటంతో తొడిదగలగూడెం నుంచి ఇల్లందువైపునకు రావడానికి రాకపోకలు స్తంభించాయి. మాణిక్యారం నుంచి చీమలపాడు వెళ్లే మార్గంలో దిగువ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై నుంచి నీళ్లు పారుతుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
చీమలపాడు రైల్వే స్టేషన్, చింతలపాడు, గాదెపాడు రైల్వే అండర్ బ్రిడ్జిలలో నీళ్లు నిలవడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కారేపల్లి, పేరేపల్లి మాదారం, గాదేపాడు పెద్ద చెరువులతోపాటు పలుకుంటలు మత్తడి పోస్తున్నాయి. నీళ్లు ప్రవహిస్తున్న రోడ్లపై, వంతెనలు, చప్టాలు దాటేందుకు సాహసించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అధికారులు సూచించారు.
గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటచేలు నీట మునిగాయి. సింగరేణి మండల పరిధిలోని చీమలపాడు, బాజు మళ్ళాయి గూడెం, రేలకాయలపల్లి, తవిసిబోడు, నాను నగర్ తండాలతో పాటు అనేక ప్రాంతాలలో రైతులు సాగు చేసిన పత్తి చేలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. అదేవిధంగా మిరప తోటలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, పంట నష్టాలను అంచనావేసి ప్రభుత్వం తమను ఆదుకునేలా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.