సారపాక/ అశ్వాపురం/ పినపాక, జనవరి 28: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వాటికి ఆకర్షితలయ్యే వివిధ పార్టీల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి వస్తున్నారని అన్నారు. మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ సీతానగరం రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన సుమారు 75 కుటుంబాల వారు వద్ద శనివారం ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రేణులంతా పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వీటిని చూసి మున్ముందు బీఆర్ఎస్లోకి మరిన్ని వలసలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, కుర్రి నాగేశ్వరరావు, కారం విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురంలో కాంగ్రెస్ నాయకుడి చేరిక..
అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి ఉప సర్పంచ్, కాంగ్రెస్ మండల నాయకుడు జానీ షాహిద్ కూడా ప్రభుత్వ విప్ సమక్షంలో మణుగూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం బీఆర్ఎస్లో చేరాడు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడి అమరేందర్, కంచుగట్ల వీరభద్రం, నేలపట్ల సత్యనారాయణరెడ్డి, గజ్జి లోహిత్, కరకపల్లి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యారోగ్యానికి పెద్దపీట..
వైద్యారోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ సీఎం కేసీఆర్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు గుమ్మడి గాంధీ, దాట్ల సుభద్రాదేవి, గొగ్గెల నాగేశ్వరరావు, చింతపంటి సత్యం, శ్రీనివాసులు, పగడాల సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో ముందుండాలి..
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. మండల పరిషత్ కార్యాలయంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.