మణుగూరు రూరల్, ఫిబ్రవరి 8: సింగరేణిని బలహీనపరిచి, కార్మికుల నోట్లో మట్టి కొట్టేందుకు బీజేపీ చేస్తున్న చర్యలను తిప్పికొడతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ బుధవారం ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఖాళీ స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ కార్మికుల చెమట చుక్కలతో దక్షిణ భారతావనికి వెలుగులు పంచుతూ యావత్ తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారంగా ఉన్న సింగరేణి అభివృద్ధిని ఓర్వలేక ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. కార్మికుల నోట్లో మన్ను కొట్టేందుకు కుట్ర పన్నుతుందన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నామని తొలిదశలో ఒకరోజు దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీక్షకు మద్దతుగా టీబీజీకేఎస్ నాయకులు, శ్రేణులు ఉదయం 8గంటలకు టీబీజీకేఎస్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో రూ.70 లక్షలతో నిర్మిస్తున్న సురక్షా బస్టాండ్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకరోజు దీక్షలో టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు భారీఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్రావు పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. విద్య, వైద్యం కల్పించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. డీఎంఎఫ్ నిధులు రూ.1.20 కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు, రూ.80 లక్షలతో నిర్మించిన డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గదులను పరిశీలించి జూనియర్ కళాశాల తరగతి గదుల్లో నాసిరకంగా జరిగిన పనులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. మారుతున్న కాలంతోపాటు విద్యలో గుణాత్మక మార్పులు అవసరమని అన్నారు. పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ విద్యార్థులు సంసిద్ధులను, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందుకోసం రూ.7,899కోట్లను కేటాయించారని, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. మరిన్ని నిధులు వెచ్చించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సర్కారు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం డిగ్రీ కళాశాల తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో వాటి ఏర్పాటుకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు ముత్యంబాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ఎంపీటీసీ రమ్య, సర్పంచ్ బచ్చల భారతి, యువజన నాయకులు, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.