కొత్తగూడెం క్రైం, జనవరి 30 : తుపాకుల మోతలతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై మెరుపు దాడికి దిగడంతో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. సీఆర్పీఎఫ్ కొత్త శిబిరం ప్రారంభం రోజే ఇరువర్గాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు జవాన్లు నేలకొరిగారు. మరో 15 మంది గాయాలతో బయటపడ్డారు. మావోయిస్టుల దాడితో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రెడ్ అలర్ట్ మోగింది. వివరాల్లోకి వెళితే& ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు టేకులగూడ వద్ద సీఆర్పీఎఫ్, పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం నూతన సీఆర్పీఎఫ్ క్యాంపును ప్రారంభించారు. తర్వాత భద్రతా చర్యల్లో నిమగ్నమైన సైనికులు అక్కడి నుంచి జునాగూడ-అలిగూడ ప్రాంతంలో పెట్రోలింగ్కి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన మావోయిస్టులు సుమారు వంద మందికి పైగా సాయుధులుగా వచ్చి టేకులగూడ శిబిరంపై మెరుపు దాడికి దిగారు.
బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు(బీజీఎల్) ప్రయోగిస్తూనే కాల్పులు జరుపుకుంటూ శిబిరంపై దండెత్తుకొచ్చి అక్కడ జనరల్ డ్యూటీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్, డీఆర్జీ జవాన్లపై కాల్పులు జరిపారు. దాడిని ఊహించని జవాన్లు కాస్త ఆలస్యంగా తేరుకొని ఎదురు కాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు భీకరపోరు కొనసాగినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లను ప్రయోగించినప్పటికీ జవాన్లు ధీటుగానే ఎదుర్కొన్నారు. సమాచారం మేరకు అక్కడికి అదనపు భద్రతా దళాలు రావడాన్ని గమనించిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు జవాన్లు.. కోబ్రా 201 బెటాలియన్కు చెందిన జవాన్లు దేవాన్ సీ, పవన్కుమార్, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్కు చెందిన లంబాధర్ సిన్హా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ ద్వారా మెరుగైన చికిత్స కోసం రాయ్పూర్కు తరలించినట్లు ఈ ఘటనపై స్పందించిన బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం ధ్రువీకరించారు.
గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో ఇదే ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 23 మంది జవాన్లు వీరమరణం పొందారని ఐజీ తెలిపారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మావోయిస్టుల చొరబాటును నిర్వీర్యం చేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. ఇందులో భాగంగానే మంగళవారం టేకులగూడలో నూతన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా.. నెల రోజులుగా ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరిగిన ఘటనతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సుక్మా-బీజాపూర్ జిల్లా సరిహద్దులో భారీగా పారా మిలటరీ బలగాలు మోహరించాయి. మావోయిస్టుల చర్యలను నిర్మూలించేందుకు కేంద్రం కొత్త పంథాలో వెళ్తున్నా.. తరచూ జవాన్ల శిబిరాలపై దాడులకు పాల్పడుతుండడం గమనార్హం.