ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 20 : ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రూరల్ సీఐ ముష్కరాజ్, సీసీఎస్ ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. రఘునాథపాలెం మండలం రేగులచర్ల గ్రామానికి చెందిన జంగా వెంకన్న, అదే గ్రామానికి చెందిన వెల్లబోయిన లక్ష్మణరావు, కొత్తగూడెం జిల్లా ఎదురుగడ్డ ప్రాంతానికి చెందిన పల్లపు సంపత్తులు ఓ ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. సిసిఎస్ సివిల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
వారిని విచారించగా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, గొల్లగూడెం, మద్దులపల్లి గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నేలకొండపల్లి, కానాపురం, రఘునాధపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 190 గ్రాముల బంగారం సుమారు 20 లక్షల విలువ గల ఆభరణాలను రికవరీ చేసినట్లు చెప్పారు. వారిని జిల్లా కోర్టులో హాజరు పరచడం జరిగిందన్నారు. కేసును విజయవంతంగా చేధించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్, దశరథ, నాగేంద్రప్రసాద్, రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ పీసీ సంజీవ్ కుమార్, సిసిఎస్ కు చెందిన సీసీలు హరికృష్ణ, నరసింహరావు, సుధీర్, సంజీవ్, జానీ పాషా, మంగ్త్యలను ఏసీపీ అభినందించారు.