భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది వానకాలం పంటల సాగు జోరుగా సాగుతున్నది. రైతులు అధిక మొత్తంలో పంటలను సాగు చేస్తున్నారు. ఒకవైపు రైతుబంధు మరోవైపు గిరిజన రైతులకు పోడుపట్టాలు ఇవ్వడంతో సాగులో సంబురంగా సాగిపోతున్నారు. గత ఏడాది పత్తి పంటకు మద్దతు ధర పెరగడంతో ఈ ఏడాది పత్తి సాగుపై ఎక్కువ దృష్టిపెట్టారు. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 1,62,101 ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ ఏడాది 1,99,720 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అదే తరహాలో మిర్చి పంటను ఇప్పటివరకు 15,860 ఎకరాల్లో పంటను వేశారు. ఇంకా వేసేందుకు రైతులు సమాయాత్తమవుతున్నారు. ఒకవైపు వైరస్ ప్రభావం వల్ల తెగుళ్లు ఆశించడంతో రైతులు అదను చూసి మిర్చి వేయడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పంటలను 4,96,195 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు.
విస్తారంగా పత్తి సాగు
ప్రతి పంటకు రాష్ట్రంలో మద్దతు ధర అనువుగా ఉండడంతో రైతులు కూడా అదేస్థాయిలో పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది పత్తి మద్దతు ధర క్వింటా రూ.9 వేలకు పైగా ధర పలకడంతో రైతులు ఈ ఏడాది అధిక మొత్తంలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇప్పటికే వందశాతం పైగా పత్తి పంటను వేయడంతో పంటపూత దశకు వచ్చింది. పత్తికి ఇప్పటివరకు ఎలాంటి తెగుళ్లు ఆశించనందున రైతులు జోర్దార్గా సాగులో సంబురంగా సాగిపోతున్నారు. మరోవైపు అదేస్థాయిలో మిర్చి పంటను కూడా సాగు చేస్తున్నారు. తొలిదశలో మిర్చినారులో వైరస్ ప్రభావం సోకడంతో రైతులు కొంత ఆందోళన చెంది మళ్లీ వేరే నారును వేస్తున్నారు. అయినప్పటికీ మిర్చి పంట సాగు కూడా పెంచారు.
అత్యధికంగా వర్షాలు
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. కేవలం ఒక్క జూలై నెలలో 302 మిల్లీమీటర్లు వర్షపాతం కురియాల్సి ఉండగా అత్యధికంగా 615 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడంతో చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో రైతన్నలకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉంది. మత్స్యకారులకు కూడా చెరువుల్లో చేపల పెంపకానికి అనువుగా మారింది.
అధిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులు
పంటల్లో అధిక దిగుబడులు సాధించాలని రైతులు ఆధునిక పద్ధతులను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కేవీకే శాస్త్రవేత్తలు సైతం పంట పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇస్తున్నారు. మిర్చి పంటను సాగు చేయాలంటే ముందుగా నేల స్వభావం తెలుసుకుని పంటను వేయాలని చెబుతున్నారు. సారం ఉన్న భూముల్లోనే మిర్చి పంటలను వేస్తే దిగుబడి సాధించవచ్చంటున్నారు. పత్తి పంటలకు పూతకు వచ్చినప్పుడు వ్యవసాయఅధికారుల సూచనలు తీసుకోవాలని చెప్తున్నారు. పూత సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే పంటలకు ఢోకా లేదంటున్నారు.
పత్తి బాగా పెరిగింది
ఐదు ఎకరాల పత్తి వేశాను. గత ఏడాది రెండెకరాలు వేశాను. రేటు బాగా ఉంది.. అందుకే ఈ ఏడాది పెంచాను. పత్తి పంట బాగా పెరుగుతున్నది. రైతుబంధు కూడా వచ్చింది. ఈ నెలలో పెద్ద వానలు కురిస్తే పంట ఇంకా బాగా ఉంటది. మిర్చి నారు అక్కడక్కడా వైరస్ వచ్చింది. వేర్లు నల్లబడుతున్నాయి. మళ్లీ మొక్కలు వేస్తున్నాం.
– బానోత్ రాజ్య, జండాలతండా, టేకులపల్లి మండలం
పంట పండితేనే రైతు
పంట వేయడం కాదు పండించడం గొప్ప. అప్పుడే రైతు రాజు అవుతాడు. పత్తి ప్రతి ఏడాది రైతును పైకి ఎక్కిస్తుంది. అందుకే పత్తి బాగా వేస్తున్నారు. నేనూ ఐదెకరాలు వేశాను. రెండు దుక్కిల వర్షం కురిస్తే దిగుబడి బాగా వస్తది. సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేసిండు. రైతుబంధు ఇచ్చాడు. ధైర్యంతో ముందుకుపోతున్నాం. రుణమాఫీ కూడా వచ్చింది.
– జర్పుల ధోలా, సీతారాంపురం, లక్ష్మీదేవిపల్లి మండలం