పల్లెల్లో కల్లాలన్నీ ఎరుపెక్కాయి.. ఎక్కడ చూసినా ఎర్రబంగారం గుట్టలుగా దర్శనమిస్తున్నది.. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 70 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుండడంతో అన్నదాతలు సంబురపడుతున్నారు.. దీనికితోడు మార్కెట్లో మిర్చికి డిమాండ్ ఉండడంతో మంచి ధర పలుకుతున్నది.. ఖమ్మం మార్కెట్లో మంగళవారం మిర్చి క్వింటాకు రూ.21,800 గరిష్ఠ ధర పలికింది. జాతీయస్థాయి రికార్డు ధరను గతంలో ఖమ్మం మార్కెట్ బ్రేక్ చేయగా.. మరోసారి అదే రికార్డును మార్కెట్ ఓవర్ క్రాస్ చేసింది. కాగా, కూలీలకు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు నిరంతరాయంగా మిర్చి తోటల్లో ఉపాధి లభిస్తున్నది. ప్రస్తుతం మిర్చి ఏరివేత పనులు జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వలసవచ్చిన కూలీలకు సైతం మిర్చి తోటలు జీవనాధారంగా మారాయి. పెట్టుబడి పోను మంచి ఆదాయం కండ్ల చూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– కూసుమంచి, మార్చి 14
కూసుమంచి, మార్చి 14: వాణిజ్య పంటల్లో ముఖ్యమైన మిర్చి పంటను ఖమ్మం జిల్లాలో గతంతో పోల్చితే ఈసారి అధికంగా సాగువేశారు. పెట్టుబడి ఖర్చు అధికంగానే ఉన్నా ఆదాయం కూడా అదేస్థాయిలో ఉండడం, ఈ ఏడాది మంచి ధర పలకడం, ఉచిత కరెంట్, సాగునీరు, పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తుండడంతో వేలాది మంది రైతులు మిర్చిసాగు వైపు మొగ్గు చూపారు. జిల్లావ్యాప్తంగా 70వేల ఎకరాల్లో ఈసారి మిర్చిసాగు జరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. గత సంవత్సరం మిర్చికి తెగుళ్లు రావడంతో ఈసారి జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో మిర్చికి బదులుగా పత్తి వేశారు. జిల్లాలో అత్యధికంగా జూలూరుపాడు, కూసుమంచి, తిరుమలాయపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ ప్రాంతాల్లో అధికంగా మిర్చి సాగుచేశారు. తల్లాడ, నేలకొండపల్లి, కొణిజర్ల, ఏన్కూరు, ఎర్రుపాలెం, కామేపల్లి తదితర మండలాల్లో సాగర్ ఆయకట్టు పోను మిగిలిన ప్రాంతాల్లో మిర్చి వేశారు. రైతులు విత్తనాలను నర్సరీల్లో పెట్టి మొక్కలైన తర్వాత తీసుకుపోయి తోటల్లో వేశారు. అన్నీ హైబ్రీడ్ రకాలు కావడంతో నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
మిర్చి రైతులకు కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా ఒక్కంటికీ రూ.20 వేల పైన ధర పలుకుతుండగా ఎకరాకు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. పెట్టుబడులు పోను రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతున్నాయి. తోటలు వేసినప్పటి నుంచి మార్కెట్కు తరలించే వరకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. రైతులకు ఈసారి మూడు రకాల తెగుళ్లు రావడంతో కొంతవరకు నష్టం జరిగింది. వాటిలో వేరుకుళ్లు(విల్ట్), జమినీ వైరస్, నల్లి వంటి కొంతవరకు నష్టం వచ్చింది. వాటిలో విల్ట్ వల్ల చాలా తోటలకు నష్టం కలిగింది. అయినప్పకీ దిగుబడులు బాగా రావడం, మార్కెట్లో మిర్చికి మంచి రేటు ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
పలువురి రైతులకు ఎకరాకు 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వచ్చింది. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాలతోపాటు కూసుమంచి మండలంలోని గ్రామాల్లోని రైతులకు ఈసారి మంచి దిగుబడి వచ్చింది. గత సంవత్సరం మిర్చి తోటలు దెబ్బతిన్నా ఈసారి మంచి దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు. మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ర్టాల నుంచి కూలీలు వలసవచ్చి మిర్చి కిలోకు రూ.10 చొప్పున ఏరుతున్నారు. రైతులకు ఈ సారి ఆశించిన స్థాయిలో మిర్చి దిగుబడి రావడంతో ఆనందంగా ఉన్నారు. జిల్లాలో గత ఏడాది మిర్చి 95వేల ఎకరాల్లో సాగుచేయగా తెగుళ్లు ఎక్కువగా రావడంతో ఇబ్బందిపడిన రైతులు ఈసారి సుమారు 30 వేల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గి ఆ స్థానంలో పత్తిని వేశారు.
మాది తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామం. 11 ఎకరాల్లో మిర్చి తోట వేశాను. ఇప్పటివరకు 175 క్వింటాళ్లు అయ్యింది. ఇంకా 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో మంచి రేటు ఉంది. 55 క్వింటాళ్లు అమ్మాను.. మిగిలింది ఏసీలో పెట్టాను. గతేడాది ఐదెకరాల్లో తోట వేశాను.. దిగుబడి పెద్దగా రాలేదు. ఈ సారి ఎకరాకు కనీసం 30 క్వింటాళ్లు వచ్చింది. పెట్టుబడులు పోను ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. సంతోషంగా ఉంది.
– మునిగేపల్లి శేషగిరి, రైతు, ఎర్రగడ్డ, తిరుమలాయపాలెం
ఐదెకరాల్లో మిర్చి తోట వేశా. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తోటకు తెగులు వచ్చింది.. కాని తగ్గిపోయింది. ఈ సారి మార్కెట్లో మిర్చికి మంచి ధర ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కూలీలు కిలో మిర్చి ఏరినందుకు రూ.10 వంతున తీసుకున్నారు. ఒక్కొక్కరు కనీసం 50 నుంచి 70 కిలోల వరకు మిర్చి కోశారు. దిగుబడి బాగా రావడంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మిర్చి మార్కెట్లో మంచి ధర ఉంది.
– బానోత్ ఉపేందర్, రైతు, కూసుమంచి