ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 18 : జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఈసారి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇన్స్పైర్ ప్రాజెక్ట్లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే జిల్లాలోని 109 ప్రాజెక్ట్ల కోసం 28 మంది పాఠశాలల హెచ్ఎంలు ఇంకా నమోదు చేయలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో 109 ప్రాజెక్ట్లకు రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయగా.. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు ప్రాజెక్ట్లు రూపొందించారు. ప్రాజెక్ట్ వీడియో, ఆడియో, ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వీడియో నిడివి 2 నిమిషాలు, 30 ఎంబీ దాటకుండా ఉండాలని సూచించారు. అయితే గతంలో కొవిడ్ సమయంలో ఆన్లైన్లో నిర్వహించిన ప్రదర్శన నిబంధనలను ఈసారి అమలు చేశారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి గుజరాత్కు చెందిన అభిలాష్ సమన్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో పరిశోధనలు పరిశీలించి ప్రతి నమూనాకు 10 మార్కుల చొప్పున కేటాయించనున్నారు. ప్రతి జిల్లా నుంచి ఎంపికైన నమూనాల్లో 10 శాతం నమూనాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27వ తేదీ తర్వాత తేదీలను ఖరారు చేసి ఆన్లైన్లో ప్రదర్శనలను వీక్షించనున్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో గల పాఠశాలలకు చెందిన విద్యార్థులు విద్యా శాఖ సూచించిన అంశంపై ప్రాజెక్ట్లను రూపొందించగా.. సైన్స్ ఫెయిర్ను మాత్రం ఆన్లైన్ ప్రదర్శన ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకోసం సైన్స్ అధికారి జగదీశ్వర్ ఆధ్వర్యంలో 8 మంది హెచ్ఎంలతో కూడిన బృందాలను ఎంపిక చేశారు. ఈ నెల 20, 22వ తేదీల్లో ఖమ్మంలోని రెజొనెన్స్ శ్రీనగర్ స్కూల్ కేంద్రంగా ఆన్లైన్ ప్రదర్శనలను వీక్షించి ఉత్తమంగా నిలిచిన వాటిని ఎంపిక చేయనున్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ప్రాజెక్ట్లను అంశాలవారీగా సంబంధిత బృందాలకు విభజించి అందజేయనున్నారు. ఈ ప్రక్రియను డీఈవో సోమశేఖర శర్మ పర్యవేక్షిస్తున్నారు.