పంటలో కలుపు నివారణకు.. భూమిలో తేమ శాతాన్ని సంరక్షించేందుకు.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు జిల్లా రైతులు మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా కూరగాయలు, పండ్లు, మిర్చి తదితర పంటల సాగులో ఈ విధానాన్ని అవలంబిస్తున్న రైతులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. సాగు ఖర్చు కూడా 40 శాతం వరకు తగ్గుతుండడం.. ఆసక్తి కలిగిన రైతులకు ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుండడంతో ఏటేటా ఈ విధానంపై మక్కువ చూపుతున్నారు.
ఖమ్మం వ్యవసా యం, డిసెంబర్ 18 : తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే మల్చింగ్ విధానంపై రైతులు మక్కువ చూపిస్తున్నారు. ఈ విధానంపై సాగయ్యే భూమి విస్తీర్ణం కూడా క్రమంగా పెరుగుతోంది. వార్షిక, ద్వైవార్షిక, బహువార్షిక పంటల సాగులో పాలీ ఫిల్మ్ను భూమిపై కప్పే విధానాన్నే మల్చింగ్ అంటారు. కూరగాయలు, పండ్లు, మిర్చి తదితర పంటల సాగులో కొన్నేళ్లుగా జిల్లా రైతులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. తద్వారా అనేక ప్రయోజనాలూ పొందుతున్నారు. ఈ పద్ధతిలో పంటనుబట్టి పాలీ ఫిల్మ్ను వాడాల్సి ఉంటుంది. రెండు రకాల పాలీ ఫిల్మ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి పైన సిల్వర్ కలర్ ఉండి లోపలి భాగం నలుపు రంగులో ఉంటుంది. రెండోది పైభాగం, లోపలి భాగం రెండూ నలుపు రంగులోనే ఉంటాయి. వార్షిక పంటలైన కూరగాయలు, మిర్చి తోటలకు 20-25 మైక్రాన్ల మందం కలిగిన రకం, ద్వైవార్షిక పంటలు (వంగ, దొండ)కు 40-45 మైక్రాన్ల మందం కలిగిన రకం, బహువార్షిక పంటలైన పండ్ల తోటలకు 50-100 మైక్రాన్ల మందం కలిగిన పాలీ ఫిల్మ్లు మాత్రమే వాడాల్సి ఉంటుంది.
మల్చింగ్ సాగు వల్ల భూమిలో నిత్యం తేమశాతం సంరక్షించుకునే అవకాశం ఉంది. భూమి నుంచి నీరు ఆవిరి కాకుండా మొక్క నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. ఈ విధానం నేలలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి మొక్కకు తగిన సూక్ష్మ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ సూక్ష్మ వాతావరణం వల్ల దిగుబడులు మరింత పెరిగే అవకాశం కలుగుతుంది. పంటలో కలుపు నివారించుకునే అవకాశమూ ఉంది. భూమిలో చీడపీడలకు కారణమైన బ్యాక్టీరియా, శిలీంద్రాలు, ఇతర బ్యాక్టీరియాలు పూర్తిగా నశించే అవకాశం ఉంది. పైభాగం సిల్వర్ కలర్ ఉండే పాలీ ఫిల్మ్ వాడడం వల్ల క్రిమి కీటకాలు దరిచేరవు. పంట పూర్తయ్యేలోపు (డ్రిప్ ద్వారా) వేసిన ఎరువులు పూర్తిస్థాయిలో మొక్కలకు అందుబాటులో ఉండి దిగుబడులు పెంచుకునేందుకు దోహదం కలుగుతుంది. భూమి గుల్లబారి సమయానుకూలంగా మొక్కలకు కావాల్సిన నీరు, లవణాలు, పోషకాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ విధానం ద్వారా సాగు ఖర్చు కూడా 40 శాతం వరకు తగ్గుతుంది.
జిల్లావ్యాప్తంగా ఉద్యాన రైతులు 275 ఎకరాల్లో మల్చింగ్ పద్ధతిలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ మండలాల్లో పలువురు రైతులు మల్చింగ్ విధానం అవలంబిస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులు కూడా ఆసక్తి కలిగిన రైతులకు తగిన ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఒక హెక్టార్కు రూ.16 వేల రాయితీ అందిస్తున్నారు. రైతులు తాము కొనుగోలు చేసుకొని దరఖాస్తుతోపాటు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతా నెంబర్ను ఉద్యాన శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చు. క్షేత్రస్థాయి తనిఖీ అనంతరం గరిష్ఠంగా ఒక రైతుకు 2 హెక్టార్ల వరకూ నిర్దేశించి తగిన రాయితీని సదరు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.