మార్కెట్లో మటన్, చికెన్ కన్నా ధర తక్కువ.. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఎక్కువ. ఎన్నో పోషక విలువలున్న చేపలు తినడానికి మక్కువ చూపుతున్నారు సామాన్య, పేద ప్రజానీకం. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో సమృద్ధిగా ఉన్న నీటిలో పుష్కలంగా పలు రకాల చేపలు లభిస్తుండడంతో కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ చెరువుల్లో 30 రకాలకు పైగా చేపలు దొరుకుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొర్రమట్ట, వాలుగ, జెల్ల, బంగారు తీగ, రవ్వు, కొమ్ముజెల్ల, చందమామలు, కొడిపెలు, బొచ్చె, పాపెర, మెరిగ, ఎల్లం కొడిపెలు, గ్యాస్ కట్, గురకలు, మార్పులు, గడ్డి పులసలు, రొయ్యలు తదితర రకాలు లభిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో దొరికే ‘పులస’ చేపకు మంచి డిమాండ్ ఉంది. చేపలన్నీ ధర తక్కువగాను, రుచి ఎక్కువగా ఉండడంతో జనాలు విరివిగా కొనుగోలు చేస్తూ వాటితో ఫ్రై, పచ్చళ్లు, పులుసు తదితర వంటకాలు చేస్తూ భుజిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో ‘మెతుకు మేనత్త.. నీసు కన్నతల్లి’ అనే పలుకుబడిని గ్రామీణప్రాంతాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. కారణం.. ‘మెతుకులాంటి మేనత్త ప్రేమ కడుపునింపినా.. నీసు మాత్రం కన్నతల్లివంటి ప్రేమతో ఆత్మ సంతృప్తినిస్తుంది’. అందుకే మన ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాన్వెజ్ వంటలు విరివిగా వండి వడ్డిస్తారు. వాటిల్లో అత్యంత ప్రత్యేకమైనవి చేపలే. ఈ కరోనా కాలంలో మటన్, చికెన్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో మధ్య తరగతి నుంచి పేద ప్రజల వరకూ అంతా పౌష్టికాహారం కోసం చేపలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. కారణం.. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చేపలకు మించినవి లేవు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ వచ్చాక వానలు బాగా కురిసి, భూగర్భ జలాలు పెరిగి, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మన దగ్గర దాదాపు 33 రకాల చేపలు పెరుగుతున్నాయి. మటన్, చికెన్తో పోల్చితే చేపలు తక్కువ ధరకు లభిస్తుండడంతో ప్రజలు వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొర్రమట్ట, వాలుగ, జెల్ల, బంగారు తీగ, రవ్వు, కొమ్ముజెల్ల, చందమామలు, కొడిపెలు, బొచ్చె, పాపెర, మెరిగ, ఎల్లం కొడిపెలు, గ్యాస్ కట్, గురకలు, మార్పులు, గడ్డి పులసలు, రొయ్యలు తదితర రకాలు ఉన్నాయి. వీటిలో అధిక రకాలను జలాశయాల్లో పెంచుతున్నారు. మత్స్యకారులు సీజన్లో చేపలను పట్టి విక్రయాలు సాగిస్తుంటారు. అలాగే తెలంగాణలో ఎక్కువ కొర్రమేను చేప దొరుకుతుంది. భద్రాద్రి జిల్లాలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో ‘పులస’ చేప దొరుకుతుంది. దీనికికూడా మంచి డిమాండ్ ఉంది. ఈ చేపలన్నీ ధర తక్కువగాను, రుచి ఎక్కువగా ఉండటంతో జనాలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు.
అన్ని రకాల చేపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చేపల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలను సమృద్ధిగా ఉంటాయి. చేప కొవ్వు శరీరానికి, మెదడుకు చాలా మంచిది. ప్రత్యేకంగా గుండె సంబంధిత వ్యాధులను అరికడతాయి. చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, మెదడులో రక్తం గడ్డకట్టకుండా నిరోధించటానికి సహాయపడుతుంది. చేపల్ని తినడంవల్ల హార్ట్స్ట్రోక్ల ప్రమాదం తగ్గుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. చేపల్ని తినడం వల్ల కంటి సమస్యలు నయం అవుతాయి. అంతేకాకుండా ఎముకల్లో వాపును తగ్గిస్తాయి. చేపల్ని గర్భిణులు తింటే పిండం అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే బాలింతలు తింటే పాలు ఎక్కువగా వస్తాయి. ఇక శరీరానికి కావాల్సిన వేడిని చేపలు అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెంపొందడానికి చేపలు మంచి పౌష్టికాహారం.