కూసుమంచి, ఫిబ్రవరి 16: ఎగువన సాగర్ ప్రాజెక్ట్లో జలాలు నిండుకోవడంతో ఖమ్మం జిల్లాకు సాగు జలాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నష్టపోయే వారిలో పాలేరు పాత కాలువ ఆయకట్టు రైతులూ ఉన్నారు. ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం రైతులు 7,548 ఎకరాల్లో వరి, 614 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు. వీటిలో సాగునీరు ప్రస్తుతం అందక 500 ఎకరాలకు పైగా పైరు ఎండింది. కొన్నిచోట్ల భూములు నెర్రెలు బారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు మరో వెయ్యి ఎకరాల పంటను రైతులు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తున్నది.
పాలేరు పాత కాలువ ఆయకట్టు పరిధిలోని కూసుమంచి మండలం పెరికసింగారం, మల్లేపల్లి, ముటాపురం, జక్కేపల్లి, గోరీలపాడు తండా, నేలకొండపల్లి మండలంలో చెన్నారం, బోదులబండ, సుర్ధేపల్లి, మండ్రాసుపల్లి, రామచంద్రాపురం, తిరుమలాపురం, కోనాయిగూడెం, ఆరెగూడెం, సింగరెడ్డిపాలెం, పైనంపల్లిలో సాగు చేస్తున్న పంటలు నీటి తడులు అందక ఎండిపోయాయి. పెరికసింగారం, జక్కేపల్లిలో తీవ్రత కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నది. పొలాల్లో బోరు వసతి ఉన్న వారు మాత్రం మిగిలిన పంటనైనా కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం పాలేరు జలాశయానికి జలాలను కేవలం ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో యంత్రాంగమూ చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నది. కళ్లముందే పంట ఎండిపోతుంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురానికి చెందిన చిమటం నర్సయ్య అనే రైతు బోరును నమ్ముకుని ఎకరంన్నరలో వరి సాగు చేస్తున్నాడు. భూగర్భజలాలు ఇంకిపోవడంతో తాను సాగు చేస్తున్న పంటను ఇటీవల పశువులకు వదిలేశాడు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కనీసం రెండు తడులకు నీరు వదలాలని రైతులు కోరుతున్నారు.
నేను ఆరెకరాల్లో వరి వేశాను. పాలేరు పాత కాలువకు జలాలు వస్తాయని ఆశించా. కానీ నిరాశే ఎదురైంది. ప్రస్తుతం మూడెకరాలు ఎండిపోయింది. మిగిలిన పంటకు మరో రెండు తడులు ఇస్తే తప్ప చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు నేను రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాను. మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియడం లేదు.
నేను రెండెకరాలు కౌలుకు తీసుకున్నా. ఒక్కో ఎకరానికి రూ.22 వేలు కౌలు చెల్లించాల్సి ఉన్నది. ఆ భూమిలో ప్ర స్తుతం వరి సాగు చేస్తున్నా. జలాలు రాకపోవడంతో ఎకరా పంట ఎండిపోయిం ది. పంట చేతికొచ్చే పరిస్థితి, భూయజమానికి కౌలు చెల్లించే పరిస్థితి లేదు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. దానిలో నేను వరి పండిస్తున్నా. నీరు అందక ఇప్పుడు ఎకరంన్నర ఎండిపోయింది. రూ.50 వేల పెట్టుబడి గంగలో పోసినట్లయింది. ఈ సారి నష్టాలు తప్పవు. రాష్ట్రప్రభుత్వం రైతులపై దయ ఉంచి రెండు తడులకు జలాలు విడుదల చేయాలి. పాలేరు ఆయకట్టు రైతులకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.