రఘునాథపాలెం, మే 29: ఖమ్మం జిల్లాలో రైతుల సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) విజయనిర్మల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో పచ్చిరొట్ట, పిల్లి పెసర, జీలుగు విత్తనాలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. మండల కేంద్రమైన రఘునాథపాలెం సహకార సంఘంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుడు 20,370 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 21,276 క్వింటాళ్లు అవసరం కాగా ఇప్పటికే 14,167 క్వింటాళ్లను సొసైటీల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కాగా 7,356 క్వింటాళ్లను విత్తనాలు అవసరమైన రైతులకు 60 శాతం సబ్సిడీపై అందించినట్లు తెలిపారు. డిమాండ్కు తగినట్లు విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు అదనంగా మరో 10 వేల క్వింటాళ్లు తెప్పించేందుకు ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపించినట్లు చెప్పారు. అంతేగాక ఈ ఏడాది అంచనా మేరకు 2,01,900 పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. మొలక శాతం పరీక్షించిన తరువాతనే విత్తనాలను రైతుల సరఫరా చేసేందుకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అకాల వర్షాలను రైతులెవరూవిత్తనాలు విత్తొద్దని, అదును చూశాక మాత్రమే సాగును ప్రారంభించాలని సూచించారు. ఎర్ర నేలలకు 60 మిల్లీమీటర్లు, రేగడి నేలలకు 65 70 మిల్లీమీటర్ల వర్షం అవసరమని అన్నారు. పచ్చిరొట్ట, పిల్లిపెసర, జీలుగు పంటలను నేలలో కలిపి దున్నాలని సూచించారు. సేంద్రియ పదార్థాలకు, కర్బన శాతం పెరుగుదలకు వీటిని వినియోగించుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. రైతులందరూ ఒకే రకం విత్తనాలపై దృష్టి సారించకుండా, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పలు రకాల విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. పత్తికి నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయని అన్నారు. వర్షపాతాన్ని గమనించి యాజమాన్య పద్ధతులను అవలంబించాలని సూచించారు. అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే, కొనుగోలు చేసినప్పటి రసీదును పంట దిగుబడి వచ్చే వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. నిషేధిత బీటీ-3, హెటీ కాటన్ రకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించి ఎవరైనా విక్రయిస్తున్నట్లు గమనిస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు. అనంతరం రఘునాథపాలెంలోని ‘జై కిసాన్’ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. విత్తన గోదాము ఆర్ఎం భిక్షం, ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో ఇంటూరి భాస్కర్రావు, చాయాదేవి, సొసైటీ చైర్మన్ తాతా రఘురాం, సీఈవో మద్దినేని వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.