‘ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన సభ నవ్వుల పాలైంది. రైతుల గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు గురువిందను తలపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కోలేకనే అమిత్షా బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. కేసీఆర్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్లో రూ.90లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ పనులు, ఇల్లెందులో రూ.5కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్డిపోను ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీ టీం కాదని.. ఎవరికీ కొమ్ము కాయదని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చేందుకు దొడ్డి దారిన వెళ్లి, ఢిల్లీలో వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నప్పుడు రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా ఏం ఆశించినా ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.
– ఖమ్మం, ఆగసు ్ట28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 28:(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కేంద్ర హోంమంత్రి అమిత్షా ఖమ్మం సభలో ప్రసంగం గురువింద సామెతను గుర్తు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం ఇల్లెందులో రూ.5 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి అజయ్ కుమార్ ప్రసంగించారు. బీఆర్ఎస్ ఏ పార్టీకీ బీ-టీమ్ కాదని, ఎవరికీ కొమ్ము కాయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమనే విషయాన్ని సీఎం కేసీఆర్ అనేక సార్లు స్పష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-భరోసా యాత్ర రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేదని, బీజేపీ చేసిన రైతు వ్యతిరేఖ చట్టాల వల్ల పంజాబ్, హర్యాన, డిల్లీ రాష్ర్టాలకు చెందిన ఏడు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయినప్పుడు బీజేపీ ఇచ్చిన భరోసా ఏమిటని ప్రశ్నించారు. కుటుంబ పాలన గురించి గొంతు చించుకుంటున్న బీజేపీ నేతలు.. తమ నేతలు చేస్తున్నదేమిటని, అమిత్ షా కుమారుడు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి ఎలా అయ్యారని మంత్రి ప్రశ్నించారు. అన్ని వర్గాలను ఆదుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయంగా ఏమి ఆశించినా ప్రయోజనం లేదని, ప్రజలంతా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి లేదని, బీజేపీ సభ కుర్చీలు ఎక్కువ.. మంది తక్కువ.. అని అన్న రీతిలో సభ సాగిందని విమర్శించారు.
ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లిస్తామని, ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించారన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్న పార్టీ అని, గత మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లెందు బస్డిపోను మంజూరు చేస్తే ఇల్లెందు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ను గెలిపిస్తామని.. ప్రజలు వాగ్దానం చేసి నెరవేర్చానని, అందుకే ఇల్లెందు బస్డిపో నిర్మాణానికి నిధులు లేకపోయినా డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.5కోట్లు మంజూరు చేసి డిపో నిర్మాణం చేపట్టామన్నారు. ఇల్లెందు నుంచి రాత్రి సర్వీసులను సైతం నడుపుతామని, ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.
బస్ డిపో సాధిస్తానని అనుకోలేదు
ఇల్లెందు, ఆగస్టు 28: ఇల్లెందుకు బస్ డిపో సాధిస్తానని నా జన్మలో అనుకోలేదు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. సోమవారం స్థానిక బస్డిపోలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఆమె మాట్లాడారు. 60 ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలు బస్డిపో కావాలని విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబునాయుడు, కిరణ్కుమార్రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికల్లో హామీ ఇచ్చినా వారి మాటలు నీటిమూటలే అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి అజయ్కుమార్ బస్సు డిపో ఇవ్వాల్సిందేనని మంత్రి అజయ్ అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మంత్రి నిలబెట్టుకున్నారని, ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిరిపై ఉన్నదన్నారు.
కాంగ్రెస్ చేవెళ్లలో ఏర్పాటు చేసిన డిక్లరేషన్ సభ పనికిమాలినదని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో ఎన్నిసార్లు ప్రస్తావించినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నారని తూర్పారబట్టారు. కాంగ్రెస్ నాయకుల మొక్కులు ఆపదమొక్కులని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరిప్రియను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, డీఎం, డిప్యూటీ ఆర్ఎం భవానీప్రసాద్, ఇన్చార్జి కంట్రోలర్ వేమూరి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ, ఎస్పీ డాక్టర్ వినీత్, డీఎస్పీ రమణమూర్తి, సీఐలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.