భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘జిల్లాలో మామిడి పంటకు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి’ అని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న తెలిపారు. 11,324 ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారని, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, జూలూరుపాడు తదితర మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారని వివరించారు. ముఖ్యంగా బంగినపల్లి, దశేరి, కేసరి, హిమాయత్, రాయల్ స్పెషల్, తోతాపురి, చిన్న రసాల సాగు ఎక్కువగా చేస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రిపూట 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉన్నదని, ఇలా మరో వారంపాటు ఉండవచ్చని చెప్పారు.
పూ మొగ్గలు బయటకు వచ్చే వరకు నీటితడి ఇవ్వకూడదు.
మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ పది గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మొగ్గ త్వరగా పగిలి పూత వచ్చే అవకాశం ఉంది.
జూన్-జూలై నెలల్లో ఎరువులు వేయకలేకపోయిన వారు ఒక చెట్టుకు 2 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, ఒకటిన్నర కిలోల యూరియా, ఒకటిన్నర కిలోల పొటాష్ వేసుకోవాలి.
నీటి వసతిలేని వారు పిందె దశలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
పూత ఆలస్యమైన తోటల్లో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి.
సాగునీటి సౌకర్యం లేని వర్షాధారపు తోటల్లో పెరుగుతున్న పిందెలు, కాయలపై ఒక శాతం యూరియా ద్రావణం పిచికారీ చేయాలి.
చీడపీడల యాజమాన్యం
ఆకులపై బూడిద మచ్చలు కనిపిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
ఆకులపై నల్లమచ్చలు ఉంటే అవి పూ కొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. అందుకే ముందుగా లీటరు నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేసి పూతకు ముందే నివారించాలి.
పూత, పిందె దశలో ఆకుమచ్చ తెగులు వ్యాప్తి చెందితే లీటరు నీటికి గ్రాము కార్బండిజమ్ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
చెట్ల కింద పాదుల్లో పవర్ వీడర్తో మట్టిని బాగా కలియబెట్టాలి. దీంతో నేలలో ఉండే పిండినల్లి, పండు ఈగ కోశస్థ దశలు నాశనమవుతాయి. ఈ పురుగుల నివారణకు ఒక చెట్టు పాదుల్లో క్లోరిఫైరిపాస్ పొడి మందు సుమారు 250 గ్రాముల చొప్పున చల్లాలి.
పిండినల్లి నేల నుంచి చెట్టుపైకి పాకకుండా చెట్టు ప్రధాన కాండంపై గ్రీజు పూసిన ప్లాస్టిక్ పేపర్లను భూమి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తులో కాండం చుట్టూ చుట్టాలి.
పండు ఈగ ఉధృతిని గమనించేందుకు ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చాలి.