‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టర్నోవర్లో 177 శాతం, నికర లాభాల్లో 430 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలోనే మహారత్న కంపెనీలతో సమానంగా నిలిచింది. 2029-30 నాటికి మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతాం’ అని సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ శ్రీధర్ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు.
కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 15: 2029-30 నాటికి మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతోందని డైరెక్టర్ (పా) బలరాం పేర్కొన్నారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన మన సంస్థను మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. అనేకమంది మహావీరులు ప్రాణాలర్పించి స్వాతంత్య్రాన్ని సాధించడం వల్లనే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని, అనేక విషయాల్లో దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సంస్థ సీఎండీ శ్రీధర్ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. సింగరేణి సంస్థ గడిచిన తొమ్మిదేళ్లలో చరిత్రలో ఎన్నడూ సాధించలేని రికార్డులను సాధిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడకముందు సంస్థ కేవలం రూ.11,928 కోట్ల టర్నోవర్, రూ.419 కోట్ల నికర లాభాలు సాధించిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక టర్నోవర్లో 177 శాతం, నికర లాభాల్లో 430 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలోనే మహారత్న కంపెనీలతో సమానంగా నిలిచామని అన్నారు. సింగరేణి సంస్థ అద్భుతంగా పనిచేస్తోందంటూ ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సహా అందరూ ప్రశంసంలు అందించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసేందుకు రానున్న ఐదేళ్లలో మరో 12 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరావు, కే.బసవయ్య, హనుమంతరావు, కవితా నాయుడు, దీక్షితులు పాల్గొన్నారు.
సింగరేణి హెడ్డాఫీస్లో..
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ హెడ్డాఫీస్లో డైరెక్టర్ (ఓపీ) ఎన్వీకే శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అధికారులు, ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు.