నిండు వేసవి వచ్చేది.. భానుడు ప్రకోపిస్తున్నాడు.. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. వారం రోజుల క్రితం ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు రాళ్ల వాన కురుస్తుందో.. ఎప్పుడు గాలిదుమ్ము వచ్చి బీభత్సం సృష్టిస్తుందో అని భీతిల్లిన ప్రజలు ఇప్పుడు దంచి కొడుతున్న ఎండలకు తాళలేకపోతున్నారు. బెంబేలెత్తుతున్నారు.. ఎయిర్ కూలర్లు, ఏసీలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.. శీతలపానీయాలు, జ్యూస్ పాయింట్ల వద్ద రద్దీ కనిపిస్తున్నది.. ఎండల ధాటికి పగటి పూట జనం బయటకు రావడం లేదు.. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వ్యాపార సముదాయాలన్నీ బోసిపోబోయి కనిపిస్తున్నాయి.. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రోహిణీ కార్తె వస్తే ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల క్రితం ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు రాళ్ల వాన కురుస్తుందో.. ఎప్పుడు గాలిదుమ్ము బీభత్సం సృష్టిస్తుందో అని ప్రజలు, రైతులు అయోమయానికి గురయ్యారు. చల్లదనంతో కొంత ఉపశమనం పొందారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. ఉదయం 10 గంటలకే సూరీడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తప్ప మిగతా సమయమంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకుండా 45 డిగ్రీల వరకు చేరుకుంటుంది. జిల్లావ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వారం రోజుల నుంచి 44 డిగ్రీలకు తగ్గడం లేదు. రాత్రుళ్లు చల్లబడ్డట్టే ఉన్నా.. పగలు భానుడు మండిపోతూ ప్రజలను బయటకు వెళ్లనివ్వడం లేదు. పనుల కోసం వెళ్లిన కూలీలు 10 గంటలు అయితే చాలు ఎండ భయానికి ఇంటిదారి పడుతున్నారు. ఉపాధిహామీ కూలీలు కూడా ఒంటి పూట వరకే పనులు చేసుకుని అలసిపోయి ఇంటికి చేరుతున్నారు. ఇక కార్యాలయాలకు వెళ్లే వారు ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటపడి ఆఫీసులకు చేరుకుంటున్నారు. సాయంత్రం అయితే గానీ కార్యాలయాల నుంచి కదలడం లేదు.
వ్యాపారాలపై భానుడి దెబ్బ
ఉదయం 10 గంటలకు పనిచేసే కార్మికులు షాపులు తెరిచే సరికి ఎండకు తట్టుకోలేక వ్యాపారులు దుకాణాలు మూసేసుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో యజమానులు షెట్టర్లు వేసుకుని ఖాళీగా ఉంటున్నారు. చిరు వ్యాపారులు తప్ప పెద్ద వ్యాపారులు షాపులు మూసుకోవాల్సి వస్తోంది. పొట్టకూటి కోసం చిరు వ్యాపారులు ఎండను సైతం లెక్కచేయక పండ్లు, కూల్డ్రింక్, చెరుకు, నిమ్మ రసం, పుచ్చకాయల షాపులను నడిపించుకుంటున్నారు.
భగ్గుమంటున్న బొగ్గు బావులు
మామూలు ప్రాంతాల్లో ఎండ అలా ఉంటే.. బొగ్గుబావుల వద్ద మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు చెప్పకపోయినా 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కార్మిక ప్రాంతమంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్మికులు తల్లడిల్లిపోతున్నారు. యాజమాన్యం మాత్రం చల్లదనం కోసం ఆయా ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ చేస్తోంది.
హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ఇచ్చింది. మరో మూడు రోజులపాటు ఎండలు ఇప్పుడున్న దాని కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని కూడా చెప్పింది. నాలుగు రోజుల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది.
వడదెబ్బ మరింత ప్రమాదకరం
వడగాలులు చాలా డేంజర్. సైలెంట్ కిల్లర్లా మనిషి ప్రాణాలను హరిస్తాయి. ఎండలో ఎక్కువ సమయం తిరగకూడదు. వ్యాధులు ఉన్న వారు బయటకు రాకుండా ఉండటం మేలు. శీతలపానీయాలు కాకుండా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, నిమ్మ రసం తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పిల్లలను ఎండలో తిప్పకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు కూడా వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పనులు వెంటనే ముగించుకుని ఇంటికి వెళ్లాలి.
– డాక్టర్ పుష్పలత, ఎండీ(జనరల్)