ఖమ్మం, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ను కూడా ప్రకటించింది. జిల్లాలవారీగా పోస్టుల ఖాళీల వివరాలను వెల్లడించింది. నూతన జిల్లాలవారీగా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారో కూడా వివరించింది. దీంతో నిరుద్యోగులు ఈ డీఎస్సీలో ఎలాగైనా ఉద్యోగాలు సాధించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకాలం శిక్షణ కేంద్రాల చుట్టూ తిరుగుతూ, కనిపించిన ప్రతి పుస్తకాన్నీ తిరగేస్తూ, డీఎస్సీ ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్న వారంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమైపోయారు.
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అప్పటి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు కలిపి సుమారు 15 వేలకు పైగానే ఉంటారని అంచనా. టెట్లో అర్హత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీలో అవకాశం కల్పిస్తారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీలో పోస్టులు సాధించడానికి సిద్ధమవుతున్నారు. గ్రామీణ అభ్యర్థులు పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందడానికి సమాయత్తమవుతున్నారు. బీఈడీ పూర్తి చేసిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డీఈడీ పూర్తి చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు అర్హులు. ఈ డీఎస్సీలో ఖమ్మం జిల్లాలో 575 పోస్టులను, భద్రాద్రి జిల్లాలో 447 పోస్టులను భర్తీ చేయనున్నారు.
డీఎస్సీ ద్వారా చేపట్టిన టీచర్ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. పాత జిల్లాల ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. వయసు సడలింపు అవకాశం కల్పించారు.